Electoral Bonds Case : ఎలక్టోరల్ బాండ్స్ కేసులో ఎస్బీఐపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
అన్ని వివరాలను వెల్లడించాలని గతంలో ఇచ్చిన తీర్పులో వెల్లడించినా ఎస్బీఐ పట్టించుకోక పోవడంపై సీజేఐ డివై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Harishth Thanniru
- Published On : March 15, 2024 / 12:04 PM IST
Supreme Court
Supreme Court : ఎలక్టోరల్ బాండ్స్ కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలక్టోరల్ బాండ్లపై కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఎలక్టోరల్ బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ నెంబర్లను ఎస్బీఐ తమకు సమర్పించలేదని ఈసీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన డేటాలో బాండ్ల నెంబర్లను ఎందుకు అందజేయలేదని సుప్రీంకోర్టు ఎస్బీఐను ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఎలక్టోరల్ బాండ్స్ కేసులో ఎస్బిఐకి సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం నోటీసులు జారీచేసింది. బాండ్స్ నెంబర్లు లేకపోవడంతో ఎవరు ఎవరికిచ్చారన్న విషయం తెలియడం లేదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అన్నివివరాలను వెల్లడించాలని గతంలో ఇచ్చిన తీర్పులో వెల్లడించినా ఎస్బీఐ పట్టించుకోక పోవడంపై సీజేఐ డివై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు సోమవారంకు వాయిదా వేసింది.
ఈ నెల 18న జరిగే తదుపరి విచారణలోగా ఎస్బీఐ వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎస్బిఐ సీల్డ్ కవర్లో గతంలో ఇచ్చిన వివరాలను స్కాన్ చేసి డిజిటలైజ్ చేయాలని రిజిస్ట్రీకి సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఎస్బిఐ సీల్డ్ కవర్ లో ఇచ్చిన వివరాలను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో రేపు సాయంత్రం 5గంటల కల్లా ఉంచాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.
