Corona Devi idol ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాని దేవతగా ప్రతిష్ట చేసి పూజలు చేసేందుకు సిద్ధమైంది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని కామాచ్చిపురి అధీనం(టెంపుల్). మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు..”కరోనా దేవి”అనే దేవతను ప్రతిష్టించి 48రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించాలని ‘కామచ్చిపురి అధినం’ అధికారులు నిర్ణయించారు. ప్రాణాంతక వ్యాధుల నుంచి ప్రజలను రక్షించడానికి దేవతలను ప్రతిష్టించడం గతంలో ఆచరణలో ఉందని వారు చెబుతున్నారు.
కరోనా దేవత విగ్రహం ప్రతిష్టించి మహా యాగం నిర్వహించనున్నట్లు కామాచ్చిపురం అధీనం ఇన్చార్జి శివలింగేశ్వర్ తెలిపారు. మహా యాగం జరిగే సమయంలో దర్శనానికి భక్తులను అనుమతించమని తెలిపారు. ఇలా వ్యాధి పేరుతో దేవతను ప్రతిష్టించి పూజలు చేయడం కొత్తేమీ కాదని.. కోయంబత్తూరులోని ప్లేగు మారియమ్మన్ ఆలయమే అందుకు నిదర్శనమని శివలింగేశ్వర్ అన్నారు. గతంలో ప్లేగు, కలరా వ్యాధులు ప్రబలినప్పుడు ప్లేగు మారియమ్మన్ దేవతను ప్రతిష్టించి పూజలు చేశారని శివలింగేశ్వర్ తెలిపారు. సినీతారల కోసం గుడులు కట్టి పూజించే అభిమానులున్న తమిళనాడులో ఇప్పుడు కరోనా దేవత ఆలయం ఆసక్తికరంగా మారింది.