భారత్@125…చాపకింద నీరులా దేశంలో కరోనా వైరస్

చాపకింద నీరులా దేశంలో కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 125కు చేరింది. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది.  కేంద్ర వైద్యారోగ్య శాఖ ఎప్పటికప్పుడు రాష్ర్టాల్లో తీసుకుంటున్న చర్యలను తెలుసుకుంటుంది.

అన్ని ఎయిర్‌పోర్టుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. రైళ్లలోనూ ఈ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రయాణికులను పరీక్షిస్తున్నారు. దాదాపు అన్ని రాష్ర్టాలు ఈ నెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. రద్దీ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సినిమా హాల్స్‌, మాల్స్‌, పబ్బులు, క్లబ్బులను మూసివేశారు. 
రాష్ట్రాల వారిగా కరోనా కేసులు
 కర్ణాటకలో మొత్తం 8 కేసులు నమోదు కాగా, ఒకరు మరణించారు. ఢిల్లీలో ఏడు కేసులు నమోదు కాగా, ఇద్దరు డిశ్చార్జి అవగా.. ఒకరు మృతి చెందారు. హర్యానాలో నమోదైన 14 కేసుల్లో అందరూ విదేశీయులే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక కేసు నమోదైంది. కేరళలో 22 కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు విదేశీయులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆస్పత్రి నుంచి ముగ్గురు డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో అత్యధికంగా 39 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ముగ్గురు విదేశీయులు ఉన్నారు.

ఒడిశా, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, తమిళనాడులో ఒక్కొక్కరికి మాత్రమే కరోనా పాజిటివ్‌ వచ్చింది. రాజస్థాన్‌లో మొత్తం 6 కేసులు నమోదు కాగా, ఇందులో ఇద్దరు విదేశీయులు ఉన్నారు. ముగ్గురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. తెలంగాణలో 4 కేసులు నమోదు కాగా, ఒకరు గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. జమ్మూకశ్మీర్‌లో మూడు, లఢఖ్‌లో నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో 13 కేసులు నమోదు కాగా, ఇందులో ఒకరు విదేశీ వ్యక్తి ఉన్నాడు. నలుగురు హాస్పిటల్  నుంచి డిశ్చార్జి అయ్యారు.

See Also | గాంధీ ఆస్పత్రిలో మరో కరోనా పాజిటివ్ కేసు..?