Union Cabinet Meeting : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం (జూన్ 16)న ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కరోనాతో దెబ్బతిన్న ఆర్ధిక పరిస్థితిపై చర్చ జరిగే అవకాశం ఉంది. అవసరమైన ప్రణాళికలు, ఉద్దీపన ప్యాకేజీలతో చర్యలు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది.
కొవిడ్ థర్డ్ వేవ్ ముప్పు ఉందన్న హెచ్చరికలతో దేశంలో వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలు, లాక్డౌన్ విషయంలో కూడా చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్ధిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా భేటీ జరుగనుంది.
లాక్డౌన్ దెబ్బకు దేశంలో వ్యాపార, వాణిజ్య రంగాలు దెబ్బతిన్నాయి. దేశ జీడీపీ మైనస్లోకి పడిపోతుందని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేబినెట్ భేటీలో ఇతర మంత్రులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. రాష్ట్రాల డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్పై మోదీ కీలక ప్రకటన చేశారు.
దేశవ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ బాధ్యత కేంద్రమే భరిస్తుందని ఆయన ప్రకటించారు. కరోనా టీకాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈనెల 21వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా సాగుతుందని పేర్కొన్నారు.