Uttar Pradesh
Uttar Pradesh: వివాహేతర సంబంధాలు దంపతుల మధ్య చిచ్చు పెడుతున్నాయి. దాంపత్య జీవితం చక్కగా సాగిపోతున్న తరుణంలో భర్తకు లేదా భార్యకు వేరే వాళ్లతో సంబంధాల కారణంగా వారి సంస్కారం బీటలు వారుతున్న పరిస్థితి. వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్తను హత్యచేస్తున్న మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా నమోదవుతుండటం ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే, తాజాగా.. యూపీలో భర్తను వదిలి ఓ మహిళ తన ప్రియుడితో వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న భర్త పోలీస్ స్టేషన్కు వెళ్లి రాతపూర్వక ఒప్పంద పత్రాన్ని సమర్పించి అందరినీ ఆశ్చర్యపర్చాడు.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని కేరి జిల్లా పర్సాముర్తా గ్రామానికి చెందిన రామ్ చరణ్కు జానకీదేవితో 20ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రామ్చరణ్ ముంబయిలో టైల్స్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. జానకీ పిల్లలను చూసుకుంటూ ఇంటి వద్దనే ఉంటుంది. భర్త పనినిమిత్తం ఎక్కువగా ముంబయిలోనే ఉంటుండేవాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం జానకికి సమీప గ్రామంలో ఉండే ఓ దినసరి కూలీ ప్రజాపతితో పరిచయం ఏర్పడింది. అతనికి 24ఏళ్ల వయస్సు. అయితే, కొద్దికాలంకు ప్రజాపతి, జానకి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఏడు నెలలు వారిద్దరూ ఒకే ఇంట్లోనే ఉన్నారు.
భార్య జానకి వేరే వ్యక్తితో ఉంటుందని తెలుసుకున్న రామ్చరణ్ పర్సాముర్తా గ్రామానికి వచ్చి ఆమెను నిలదీశాడు. దీంతో జానకి క్షమాపణలు చెప్పి.. మళ్లీ భర్తతో కలిసి ఇంటికి వచ్చింది. ఓ ఆర్నెళ్లు భర్తతో కలిసిఉన్న జానకికి.. మళ్లీ ప్రియుడు ప్రజాపతి వద్దకు వెళ్లాలనిపించింది. దీంతో భర్తకు చెప్పకుండా మళ్లీ తన ప్రియుడి వద్దకు వెళ్లింది. జానకి కనిపించక పోవటంతో రామ్చరణ్ రెండ్రోజులు వెతికాడు. ఆ తరువాత భవానీగంజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసిన రెండ్రోజుల తరువాత జానకి ప్రియుడి వద్దకు వెళ్లిందని తెలిసింది. దీంతో ఈనెల 20న పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రామ్చరణ్ ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు.
ఇకపై జానకితో తనకు ఎలాంటి సంబంధం లేదని రాతపూర్వక ఒప్పంద పత్రాన్ని పోలీస్ స్టేషన్ లో సమర్పించాడు. గతంలో ఇలాగే చేసి తిరిగి వస్తే క్షమించాను. ఇప్పుడు మళ్లీ తన ఇంటికి రాణిస్తే నన్ను ఏమైనా చేస్తుంది.. భోజనంలో పురుగుల మందు కలిపిస్తే.. నిద్ర పోతుండగా నన్ను చంపేస్తే.. నాకు భయంగా ఉంది. ఆ భయంతో ఇకపై తనతో నేను కలిసి ఉండలేనని రామ్చరణ్ స్పష్టం చేశారు.