కేరళ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట.. ఉరిశిక్షను వాయిదా వేసిన యెమెన్ ప్రభుత్వం

కేరళ నర్సు నిమిష ప్రియకు మరణశిక్ష అమలును యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసింది.

కేరళ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట.. ఉరిశిక్షను వాయిదా వేసిన యెమెన్ ప్రభుత్వం

Nimisha Priya

Updated On : July 15, 2025 / 2:32 PM IST

Nimisha Priya: కేరళ నర్సు నిమిష ప్రియకు భారీ ఊరట లభించింది. ఆమెకు విధించిన మరణశిక్ష అమలును యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం బుధవారం మరణ శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే, భారత విదేశాంగ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలితంగా చివరి నిమిషంలో ఆమె మరణశిక్ష వాయిదా పడింది.

నిమిష ప్రియను ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు భారత ప్రభుత్వం కొద్దిరోజులుగా అన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. యెమెన్ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. మరోవైపు.. బాధిత కుటుంబంతో భారత్‌కు చెందిన ముస్లిం మత పెద్దలు కూడా పలు దఫాలుగా చర్చలు జరిపారు. కేరళకు చెందిన ఇండియా గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్, షేఖ్ హబీబ్ ఉమ్మర్ వంటి మత గురువులు క్షమాభిక్ష కోసం జరిపిన చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి.

బాధిత కుటుంబానికి ఒక మిలియన్ డాలర్ల క్షమాధనాన్ని ఇచ్చేందుకు నిమిష ప్రియ కుటుంబం సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో నిమిష కుటుంబం.. బాధిత కుటుంబం పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేలా కొంత సమయం ఇచ్చేలా భారత విదేశాంగ శాఖ ప్రయత్నాలు చేసింది. స్థానిక జైలు అధికారులు, ప్రాసిక్యూటర్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరిపింది. సంప్రదింపులు ఫలించి మరణశిక్ష అమలును వాయిదా వేసేందుకు యెమెన్ అధికారులు అంగీకారం తెలిపారని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి.

బాధిత కుటుంబానికి క్షమాధానాన్ని ఇచ్చేందుకు నిమిష ప్రియ కుటుంబం సిద్ధమైంది. ఇందుకు బాధిత కుటుంబం అంగీకరించి.. ప్రక్రియ సక్రమంగా జరిగితే.. నిమిష ప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం ఉంది.

నిమిష ప్రియపై కేసు నమోదు ఇలా..
కేరళ పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిష ప్రియ నర్సు కోర్సు పూర్తి చేసిన తరువాత 2008లో యెమెన్ వెళ్లింది. అక్కడే ఆస్పత్రిలో ఉద్యోగంలో చేరింది. 2011లో థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కొన్నిరోజుల తరువాత ఆమె సొంతంగా క్లినిక్ ప్రారంభించాలని భావించింది.

యెమెన్ దేశం నిబంధనల ప్రకారం ఇతర దేశస్తులు అక్కడ వ్యాపారం చేయాలంటే స్థానికుడితో భాగస్వామ్యం కలిగి ఉండాలి. దీంతో 2014లో నిమిషా, థామస్ జంట స్థానిక వ్యక్తి తలాల్ అదిబ్ మహదీని తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు. కొన్నేళ్ల తరువాత ఆమె భర్త, కుమార్తె కేరళకు వచ్చారు. నిమిషా యెమెన్ లోనే ఉంటూ క్లినిక్ ను కొనసాగించింది. కొన్నాళ్ల తరువాత నిమిషా ప్రియకు వ్యాపార భాగస్వామి అదిబ్ మహదీతో విబేధాలు ఏర్పడ్డాయి. దీంతో ఆమె అతనిపై ఫిర్యాదు చేసింది.

ప్రియ ఫిర్యాదుతో 2016లో మహదీ అరెస్ట్ అయ్యాడు. కొన్నాళ్లకు జైలు నుంచి విడుదలై ప్రియను బెదిరించడం మొదలు పెట్టారు. ప్రియను తన భార్యగా పేర్కొంటూ వేధింపులకు గురిచేస్తూ ఆమె పాస్‌పోర్టు లాక్కొన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోపోయే సరికి.. నిమిషా తన పాస్‌పోర్టును తిరిగి పొందేందుకు మహదీకి మత్తుమందు ఇంజెక్ట్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి.

అధిక మోతాదులో మత్తు మందు ఇవ్వడంతోనే మరణించాడని అతని కుటుంబ సభ్యలు ఆరోపించారు. ఆ తరువాత నిమిషా దేశం విడిచి పారిపోయే ప్రయత్నంలో ఆమెను పోలీసులు 2018లో అరెస్టు చేసి హత్య కేసులో దోషిగా నిర్దారించారు. ఈ కేసులో ఆమెకు మరణ శిక్ష పడింది. జులై 16న ఆమెను ఉరితీసేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. ఆమెకు క్షమాభిక్ష కోసం భారత విదేశాంగ శాఖ అక్కడి అధికారులు చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ఆ చర్చలు ఫలించాయి. నిమిష మరణ శిక్షణను యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసింది.