అభ్యర్థుల వేటలో ఏపీ కాంగ్రెస్.. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఇప్పటికే కొంతమంది తాజా మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఏపీ పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.
- Naveen
- Published On : January 23, 2024 / 05:51 PM IST
YS Sharmila Focus On AP Elections 2024
YS Sharmila : ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల వేటలో పడింది కాంగ్రెస్ పార్టీ. రేపటి నుంచి అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. రేపు విజయవాడలో తొలి అప్లికేషన్ ను ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ తీసుకోనున్నారు. ఇప్పటికే కొంతమంది తాజా మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఏపీ పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జిల్లాల పర్యటనలో పీసీసీ చీఫ్ షర్మిలను నేరుగా కలిసి తమకు అవకాశం ఇవ్వాలని ఆశావహులు కోరుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర విభజన అనంతరం 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. 2024 ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్. ఇప్పటికే షర్మిలను ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలి బాధ్యతలు తీసుకున్న షర్మిల దూకుడుగా ముందుకెళ్తున్నారు. జిల్లాల పర్యటన ద్వారా ప్రజల్లోకి వెళ్లారు షర్మిల.
Also Read : రోజా లాంటి బూతుల మినిస్టర్లు కుప్పకూలిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ రేపు ఏపీకి రానున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. 5 రోజుల పాటు ఈ ప్రక్రియ ఉండనుంది. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులన్నీ సిద్ధం కావాలని, అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు పడాలని, ఆ దిశగా ప్రతీ నాయకుడు, కార్యకర్త శ్రమించాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.
ఇక, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీలోకి రావాలని అనుకుంటున్న వారితో చర్చలు జరుగుతున్నాయి. వైసీపీలో ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. కర్నూలుకు చెందిన ఓ కీలక వైసీపీ నేత కాంగ్రెస్ నేతలతో చర్లలు జరుపుతున్నట్లు సమాచారం. మరికొందరు తమతో టచ్ లో ఉన్నారని ఏపీసీసీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : బీజేపీకి బానిసలు.. సీఎం జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ షర్మిల
