Tokyo Olympics 2020 : కాంస్య పతకం పోరులో పోరాడి ఓడిన భారత మహిళల హాకీ టీమ్
కాంస్య పతక పోరులో భారత మహిళల హాకీ జట్టు పోరాడి ఓడింది. బ్రిటన్ తో జరిగిన పోరులో 4-3 తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. ఆరంభంలో తడబడినప్పడికి ఆ తర్వాత పుంజుకుని బ్రిటన్ కి గట్టి పోటీ ఇచ్చారు.
![Tokyo Olympics 2020 : కాంస్య పతకం పోరులో పోరాడి ఓడిన భారత మహిళల హాకీ టీమ్ Tokyo Olympics 2020 : కాంస్య పతకం పోరులో పోరాడి ఓడిన భారత మహిళల హాకీ టీమ్](https://10tv.in/wp-content/uploads/2021/08/Tokyo-Olympics-2020-2.jpg)
Tokyo Olympics 2020
Tokyo Olympics 2020 : టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics) లో భారత మహిళల హాకీ జట్టు కాంస్య పోరులో ఓడిపోయింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్లో బ్రిటన్ 4-3 గోల్స్ తేడాతో పతకాన్ని సొంతం చేసుకున్నది. చివరి వరకు భారత మహిళలు పోరాడినా.. ఫోర్త్ క్వార్టర్స్లో వెనుకడుగు వేశారు. ఒకానొకదశలో భారత టీం పతాకంపై ఆశలు రేకెత్తించింది. కానీ చివరకు ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో ఒలింపిక్స్ హాకీలో చరిత్ర సృష్టించే అద్భుత అవకాశాన్ని మహిళల జట్టు మిస్సైంది.
నిజానికి భారత మహిళా జట్టు స్పూర్తిదాయకమైన ఆటను ప్రదర్శించింది. తొలి క్వార్టర్లో రెండు జట్లు గోల్ చేయలేకపోయాయి. సవితా పూనియా అద్భుతమైన రీతిలో గోల్ పోస్టు వద్ద బ్రిటన్ దూకుడును అడ్డుకున్నది. ఇక సెకండ్ క్వార్టర్లో గోల్స్ వర్షం కురిసింది. బ్రిటన్ రెండు గోల్స్ చేయగా.. భారత్ మూడు గోల్స్ చేశారు. గుర్జిత్ కౌర్ రెండు గోల్స్ చేసింది. మరో ప్లేయర్ వందనా కటారియా తన డ్రాగ్ ఫ్లిక్తో మరో గోల్ను ఇండియాకు అందించింది.
దీంతో రెండవ క్వార్టర్ లో ఇండియా ఆధిక్యత కనబరిచింది. ఇక రెండవ క్వార్టర్ లో ఆధిక్యత కనబరిచిన భారత ప్లేయర్లు మూడో క్వార్టర్ కు దూకుడుగా ఆడారు. అయితే మూడో క్వార్టర్ లో బ్రిటన్ కు గోల్ సమర్పించారు. దీంతో ఇరు జట్ల స్కోర్ సమమైంది. ఉత్కంఠభరితంగా సాగిన నాలుగవ క్వార్టర్ లో బ్రిటన్ జట్టు జోరు కొనసాగించింది. ఆట 48వ నిమిషంలో గ్రేస్ బాల్సడన్ గోల్ చేయడంతో బ్రిటన్కు ఆధిక్యం దక్కింది. చివరి క్వార్టర్లో భారత మహిళలు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు.