Afghanistan vs New Zealand : అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) అధికారులు భారత్లోని గ్రేటర్ నోయిడా స్టేడియంలోని పరిస్థితులపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కనీస వసతులు లేవని, మరోసారి ఇక్కడకు అసలు రామని అంటున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
అఫ్గానిస్థాన్ దేశంలో అంతర్జాతీయ మ్యాచులు నిర్వహించే పరిస్థితి లేదు. ఈ క్రమంలో న్యూజిలాండ్తో జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ వేదికగా భారత్లోని గ్రేటర్ నోయిడాను ఎంచుకుంది అఫ్గానిస్థాన్. సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు మ్యాచ్ జరగాల్సి ఉంది. సోమవారం తొలి రోజు కనీసం టాస్ కూడా సాధ్యపడలేదు. షహీద్ విజయ్ సింగ్ పాథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియం చిత్తడిగా ఉండడమే అందుకు కారణం. వాస్తవానికి సోమవారం అక్కడ వర్షం పడలేదు.
అయితే.. అంతకముందు కురిసిన వర్షాల వల్ల స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. సోమవారం మ్యాచ్ సమయానికి కూడా పరిస్థితి అలాగే ఉంది. దాదాపు ఆరు సార్లకు పైగా గ్రౌండ్ను సోమవారం అంపైర్లు పరిశీలించారు. ఆఖరికి నాలుగు గంటల సమయంలో తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇక మంగళవారం కూడా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటి వరకు కనీసం టాస్ వేసేందుకు వీలు పడలేదు. అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఏదీ ఇక్కడ లేదు. సూర్యుడి కాంతే దిక్కు.
ఈ క్రమంలో అఫ్గానిస్థాన్ బోర్డు అధికారులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతా గందరగోళంగా ఉంది. మేం మరోసారి ఇక్కడి రాము. ఆటగాళ్లు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఫ్యాన్స్ కూర్చునేందుకు సీట్లు, మహిళలకు వాష్రూమ్స్ లేవు. వాస్తవానికి మేం సంబంధిత వ్యక్తులతో చాలా ముందుగానే మాట్లాడాము. గతంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఈ సారి అలా ఉండబోదని హామీ ఇచ్చారు. అయితే.. ప్రస్తుతం కూడా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు.
Rishabh Pant : దులీప్ ట్రోఫీలో రిషబ్ పంత్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్