IPL తరహాలోAPL.. ఆగస్టు 8 నుంచి మ్యాచ్లు షురూ.. అన్ని మ్యాచ్లు అక్కడే..
గడిచిన మూడూ సీజన్ల కంటే ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా ఏపీఎల్ను నిర్వహించబోతున్నామని

andhra premier league
Andhra Premier League: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) నాల్గో సీజన్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రక్రియ షురూ అయింది. ఈ సందర్భంగా ఏసీఏ (ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్) గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడారు. ఏపీఎల్ సీజన్-4కు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. మారుమూల ప్రాంతాల క్రీడాకారులకు ఇదో చక్కటి అవకాశం, కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడానికి ఏపీఎల్ ఒక చక్కటి వేదిక అని, ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ ను నిర్వహిస్తున్నామని చెప్పారు.
గడిచిన మూడూ సీజన్ల కంటే ఈసారి మరింత ప్రతిష్టాత్మకంగా ఏపీఎల్ను నిర్వహించబోతున్నామని సుజయ్ కృష్ణ రంగారావు చెప్పారు. గతంలో ఆరు ఫ్రాంచైజీలు ఉండేవి, ఈసారి 7 ఫ్రాంచైజీలు ముందుకొచ్చాయని అన్నారు. ఫ్రాంచైజీలు ఫీజు రూ. 75లక్షలు ఉండేది.. ఇప్పుడు రూ.2 కోట్లకు పెరిగిందని, ప్లేయర్స్లో టాలెంట్ను బయటకి తీయాలంటే ఇలాంటి టోర్నమెంట్లు అవసరమని అన్నారు.
గత సీజన్లో 430 మంది ప్లేయర్స్ వేలంలో పాల్గొన్నారు. ఇప్పుడు 520 మందికి పెంచడం జరిగింది. ప్లేయర్స్ ను నాలుగు కేటగిరీలుగా విభజించడం జరిగిందని, సుమారు తొమ్మిది మంది టాప్ సీడ్లో ఉంటారని తెలిపారు. వీరు ఇది వరకే ఇండియాకి ఆడిన వాళ్లు, ఐపీఎల్లో ప్రతిభ కనబరిచిన ప్లేయర్స్. గ్రేడ్ Aలో 21 మంది, గ్రేడ్ Bలో 112 మంది, గ్రేడ్ C లో378 మంది వున్నారు.
ఈ ఐపీఎల్లో సూర్యవంశీ లాంటి యంగ్ ప్లేయర్స్ ఏ విధంగా ప్రతిభ కనబరిచారో అలాంటి ప్లేయర్స్ ను వెలికితీసేందుకు ఇదో చక్కటి ప్లాట్ ఫామ్ అని అన్నారు. 14వ తేదీన రాడిషన్ బ్లూలో అక్షన్ జరగబోతుందని, మెయిన్ ప్లేయర్స్ను ఫ్రాంచైజ్లు రిటేయిన్ చేసుకున్నాయని చెప్పారు. గత సీజన్లో 15 మ్యాచ్లు, ఇప్పుడు 21 లీగ్+4 ప్లేఆఫ్స్ మొత్తం 25 మ్యాచులు జరుగుతాయని చెప్పారు.
ఏసీఏ సెక్రటరీ సానా సతీష్ మాట్లాడుతూ.. ఆగస్టు 8వ తేదీ నుంచి ఏపీఎల్ మ్యాచ్లు జరుగుతాయని చెప్పారు. 14న ప్లేయర్స్ కోసం ఆక్షన్ నిర్వహిస్తున్నాం. అన్ని మ్యాచ్ లు విశాఖ కేంద్రంగా స్టేడియంలో జరుగుతాయని చెప్పారు. స్టీల్ ఎక్చేంజ్ ఆఫ్ ఇండియా, మైత్రి వంటి సంస్థలు ఈసారి ఫ్రాంచైజ్లుగా ముందుకు రావడం ఏపీఎల్కు శుభ పరిణామం అని చెప్పారు.