Ashwin Reveals How Trauma Struck During Rajkot Test
Ashwin : రాజ్కోట్లో ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టు మ్యాచ్లో రెండో రోజు టీమ్ఇండియా ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ సుదీర్ఘ ఫార్మాట్లో 500 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఆనందకర క్షణాలు అందుకున్న కొన్ని గంటల్లోనే అశ్విన్ ఓ బాధాకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. అదే రోజు సాయంత్రం అతడు ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా రాజ్కోట్ నుంచి చెన్నై వెళ్లి పోయాడు. తన తల్లి అనారోగ్యం కారణంగా అతడు వెళ్లాల్సి వచ్చింది.
అసలు ఆ రోజు ఏం జరిగిందనేది అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో వెల్లడించాడు. రెండో రోజు ఆట తరువాత మేము డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లాము. ఆ తరువాత మా గదులకు తిరిగి వచ్చాము. అందరం కలిసి మ్యాచ్ గురించి చర్చించుకుంటున్నాము. నా భార్య, తల్లిదండ్రుల నుంచి కాల్స్ రావడం లేదు అనే విషయం నేను గ్రహించాను. అయితే.. నేను వ్యక్తిగత మైలురాయిని చేరుకోవడంతో వారు ఫోన్లు మాట్లాడుతూ, ఇంటర్వ్యూలు ఇవ్వడంలో బిజీగా ఉన్నారని భావించాను.
రాత్రి 7 గంటలకు నా భార్యకు ఫోన్ చేసాను. నేను ఫోన్ చేస్తుంటే అమ్మవాళ్లు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని ఆమెను అడిగాను. ఆమె వణుకుతున్న గొంతుతో అందరి నుంచి కాస్త పక్కకు వచ్చి మాట్లాడమని చెప్పింది. మా అమ్మ తలనొప్పితో కుప్పకూలిపోయిందని చెప్పింది. అప్పుడు నాకు ఎలా స్పందించాలో అర్థం కాలేదు. నాకు తెలియకుండానే నేను ఏడుస్తున్నాను. నా గదిలోనే కొంత సేపు అలా ఏడుస్తూ ఉన్నాను.
ఎవ్వరి కాల్స్ను నేను స్పందించకపోవడంతో టీమ్ ఫిజియోతో పాటు రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మలు నా రూమ్కు వచ్చారు. పరిస్థితి వివరించా ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పాను. తుది జట్టులో నేను ఉన్నాను. నేను వెళ్లిపోతే 10 మందితోనే ఆడాల్సి ఉంటుంది. ప్రత్యర్థి పై చేయి సాధిస్తారు అనే విషయాలు నా మనస్సును తొలుస్తున్నాయి. అదే సమయంలో అమ్మతో చివరిసారి మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తున్నాను. ఆమె ఎలా ఉంది. ఆమె స్పృహలో ఉందా అని నేను డాక్టర్ను అడిగాను. ఆమె అపస్మారక స్థితిలో ఉందని డాక్టర్ నాకు చెప్పింది గుర్తుకు వస్తోంది.
ఆ తర్వాత కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ తనకు ఎలా సహకరించారో అశ్విన్ తెలిపాడు. “నేను విమానం కోసం వెతుకుతున్నాను. అయితే ఒక్కటి నాకు దొరకలేదు. రాజ్కోట్ విమానాశ్రయం సాయంత్రం 6 గంటలకు మూసివేయబడుతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత అక్కడి నుండి విమానాలు లేవు. నాకు ఏమి చేయాలో తోచలేదు. రోహిత్, రాహుల్ భాయ్ నా దగ్గరకు వచ్చారు. రోహిత్ నన్ను ఆలోచించడం మానేయమని అడిగాడు. అతను నన్ను మా కుటుంబం వద్దకు వెళ్లమని చెప్పాడు. అతను నాకు చార్టర్ ఫ్లైట్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.
పుజారాకు ధన్యవాదాలు..
పుజారా ఏదో విధంగా అహ్మదాబాద్లో కొన్ని విమానాలను కనుగొన్నాడు. టీమ్ ఫిజియో కమలేష్ను నాతో పాటు వెళ్లమని రోహిత్ చెప్పాడు. నేను వద్దని చెప్పా. నేను విమానాశ్రయానికి వెళ్లేసరికి కమలేష్ బ్యాగ్తో అక్కడ ఉన్నాడు. మాతో పాటు పుజారా సైతం వచ్చాడు. మేము ప్రయాణిస్తున్న సమయంలో కమలేష్కు రోహిత్ కాల్ చేశాడు. నా యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. ఆ రెండు గంటలు ఎలా గడిచిపోయాయో నాకు తెలియదు. అని అశ్విన్ చెప్పాడు.
Sarfaraz Khan : సునీల్ గవాస్కర్ను క్షమించమని చెప్పండి.. మళ్లీ ఆ తప్పు చేయను