Babar Azam – Pakistan : టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన కనబరిచింది. దీంతో గ్రూప్ స్టేజ్లోనే ఇంటి ముఖం పట్టింది. తొలి మ్యాచ్లో అమెరికా, రెండో మ్యాచ్లో భారత్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్తాన్ సూపర్ 8 అవకాశాలు దెబ్బతిన్నాయి. ఇక పసికూనలు కెనడా, ఐర్లాండ్లపై మాత్రం ఓదార్పు విజయాలు సాధించింది. కాగా.. పొట్టి ప్రపంచకప్లో తదుపరి దశకు చేరుకోకపోవడంతో పాక్ జట్టు పై విమర్శల జడివాన కురుస్తోంది.
మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానులు నెట్టింట పాక్ ఆటగాళ్ల పై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ ప్రయాణం ముగిసినప్పటికి కెప్టెన్ బాబర్ ఆజాంతో పాటు మరో ఐదుగురు ప్లేయర్లు స్వదేశం వెల్లలేదు. కెప్టెన్ బాబర్ ఆజం, మహ్మద్ అమీర్, ఇమాద్ వసీం, హరీస్ రవూఫ్, షాదాబ్ ఖాన్, ఆజం ఖాన్ లు అమెరికా నుంచి నేరుగా లండన్కు వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి.
కొద్ది రోజులు అక్కడే ఉండి ఆ తరువాత స్వదేశానికి రానున్నారని పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి. కాగా.. ఈ ఆరుగురు ఆటగాళ్లు మినహా మిగిలిన వారంతా మంగళవారం పాకిస్తాన్లో అడుగుపెట్టనున్నారు. ఈ ఆరుగురు ఆటగాళ్లు లండన్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపాలని ప్లాన్ చేసుకున్నారు. ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్లోని ఒక నివేదిక ప్రకారం.. కొంతమంది యునైటెడ్ కింగ్డమ్లోని స్థానిక లీగ్లలో ఆడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఇప్పట్లో పాకిస్తాన్ ఎటువంటి మ్యాచులు ఆడే అవకాశం లేదు. దీంతో ప్రధాన కోచ్ గ్యారీ కిర్స్టన్, అసిస్టెంట్ కోచ్ అజర్ మహమూద్ వారి వారి స్వస్థలాలకు వెళ్లనున్నారు. పాకిస్తాన్ జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్తో రెండు టెస్టు మ్యాచుల హోం సిరీస్ ఆడనుంది. అనంతరం అక్టోబర్లో ఇంగ్లాండ్లో పర్యటించనుంది.
Stunning Catch : మీకళ్లని మీరే నమ్మలేరు.. క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్..!