Champions Trophy 2025 Australia opt to bat in semis match against India
అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిన భారత కెప్టెన్గా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో సెమీస్ మ్యాచ్ కలుపుకుంటే ఇప్పటి వరకు హిట్మ్యాన్ 11 సార్లు టాస్ను ఓడిపోయాడు. ఈ క్రమంలో అతడు పీటర్ బోరెన్(11)తో సమానంగా నిలిచాడు. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా మాత్రమే రోహిత్ కన్నా ముందు ఉన్నాడు. లారా 12 సార్లు వరుసగా టాస్లను ఓడిపోయాడు.
కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో గత మూడు మ్యాచ్ల్లో భారత్ టాస్ నెగ్గకపోయినా ఆయా మ్యాచ్ల్లో అద్భుత విజయాలు సాధించింది. ఇలాగే సెమీస్లోనూ జయకేతనం ఎగురవేయాలని సగటు భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా.. రోహిత్ శర్మ వరుసగా టాస్ ఓడిపోవడం పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
IND vs AUS : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. ఓడిపోవడం మంచిదే అన్న రోహిత్ శర్మ..
తన వరకు అయితే టాస్ చాలా కీలకం అని భావిస్తానని చోప్రా చెప్పుకొచ్చాడు. ఎందుకంటే టాస్ గెలిస్తే.. బ్యాటింగ్ చేయాలా, బౌలింగ్ చేయాలా అన్నది మన చేతుల్లో ఉంటుందన్నాడు. అయితే.. గత కొన్ని మ్యాచ్ల్లో భారత జట్టు టాస్లను గెలవలేదు. అయినప్పటికి విజయాలు సాధించింది. దీన్ని చూస్తుంటే.. “నేను టాస్ ఓడిపోయినా.. మ్యాచ్లో ఓడిపోను.” అని కెప్టెన్ రోహిత్ శర్మ ఒట్టు పెట్టుకున్నాడని అనిపిస్తోందన్నాడు.
అయితే.. టాస్ ఓడిపోవడం పెద్ద విషయం అని చెప్పాడు. ఎందుకంటే 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఏం జరిగిందో అందరం చూశామని చెప్పాడు. నాటి ఫైనల్ మ్యాచ్లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్లుగా ఆడి ఫలితం రాబట్టింది అని. అందుకనే టాస్ చాలా కీలకపాత్ర పోషించే అవకాశం ఉందన్నాడు.
గ్రూప్ స్టేజీలో కివీస్ ఓ పొరపాటు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయమని భారత్ను ఆహ్వానించింది. నలుగురు స్పిన్నర్లతో దిగిన భారత్ను అడ్డుకుని లక్ష్య ఛేదన అంత తేలికైన విషయం కాదు. ఆ మ్యాచ్కు ముందే ఓ విషయం నేను చెప్పాను. భారత్ 270 పరుగులు చేసినా గెలుస్తుందన్నాను. అయినప్పటికి 250 రన్స్ ను కూడా కివీస్ ఛేదించలేకపోయింది. అందుకనే మైదానం గురించి పూర్తి అవగాహన ఉండడం చాలా ముఖ్యం అని ఆకాశ్ చోప్రా తెలిపాడు.