IPL 2024 : ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ ఔట్.. కారణం ఏమిటంటే?
మిచెల్ మార్ష్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక ప్లేయర్. ఏప్రిల్ 3న కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్ లో మార్ష్ ఆడాడు.
- Harishth Thanniru
- Published On : April 14, 2024 / 08:30 AM IST
Mitch Marsh
Delhi Capitals Mitchell marsh : ఐపీఎల్ – 2024 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వరుస ఓటములను చవిచూస్తుంది. ఈ టోర్నీలో ఢిల్లీ జట్టు మొత్తం ఆరు మ్యాచ్ లు ఆడగా.. కేవలం రెండు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది. నాలుగు మ్యాచ్ లలో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతుంది. తాజాగా రిషబ్ పంత్ సేనకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టుకు చెందిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఐపీఎల్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగా అతను తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఐపీఎల్ ముగిసిన వెంటనే జూన్ నెలలో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా టీ20 జట్టుకు మార్ష్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. తాజాగా అతనికి చీలమండలో పగులు రావడంతో శస్త్ర చికిత్స కోసం క్రికెట్ ఆస్ట్రేలియా అతన్ని స్వదేశానికి రావాలని సూచించింది. దీంతో, మార్ష్ స్వదేశానికి వెళ్లిపోయాడు.
Also Read : IPL 2024 : కారు వదిలి బస్సు నడిపిన రోహిత్ శర్మ.. సెల్ఫీలకోసం పోటీపడ్డ అభిమానులు.. ఫన్నీ వీడియో వైరల్
మిచెల్ మార్ష్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కీలక ప్లేయర్. ఏప్రిల్ 3న కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్ లో మార్ష్ ఆడాడు. ఆ తరువాత ముంబై , లక్నో మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఈ సీజన్లో అతడికి రాజస్థాన్ రాయల్స్ పై 23 పరుగులే అత్యధిక స్కోరు. అయితే, చికిత్స తరువాత పరిస్థితిని బట్టి మిచెల్ మార్ష్ ఢిల్లీ జట్టులో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ సైతం జట్టు నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read : IPL 2024 : రాజస్థాన్ ఖాతాలో మరో విజయం.. 3 వికెట్ల తేడాతో పంజాబ్పై గెలుపు!
డేవిడ్ వార్నర్ వేలి గాయంతో బాధపడుతున్నాడు. లక్నో జట్టుతో పోరులో వార్నర్ కు గాయమైంది. వైద్యులు స్కానింగ్ తీయించారు. గాయం తీవ్రతపై ఇంకా స్పష్టత లేదు. అయితే, అతను బుధవారం గుజరాత్ తో మ్యాచ్ కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
