Fans engage in memefest after Sanju Samson bags successive ducks in IND vs SL T20I series
Sanju Samson – Team India : శ్రీలంకతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ను భారత్ క్వీన్ స్వీప్ చేసింది. దీంతో నూతన సారథి సూర్యకుమార్ యాదవ్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అదే సమయంలో క్రికెట్ వర్గాల్లో ఓ పేరు చర్చనీయాంశంగా మారింది. అతడు మరెవరో కాదు సంజూ శాంసన్. అతడికి అవకాశాలు ఇవ్వడం లేదని పదే పదే అతడి అభిమానులు మేనేజ్మెంట్ పై విరుచుపడిన సందర్భాలు ఎన్నో. సగటు క్రికెట్ అభిమాని కూడా సంజూకు తుది జట్టులో అవకాశం ఇస్తే బాగుండేది అని అనుకునేవారు.
అయితే.. ప్రస్తుతం పరిస్థితులు మారి పోయాయి. ఇతడిని తుది జట్టులో ఆడించడం వేస్టు అని సోషల్ మీడియాలో సంజూను ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఇచ్చిన రెండు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో సంజూశాంసన్ ఘోరంగా విఫలం అయ్యాడు. కనీసం పరుగుల ఖాతా తెరవ లేదు. దీంతో ఇక ఇతడి కెరీర్ ముగిసిందని, మళ్లీ భారత జట్టులో చూడడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
వరుసగా రెండు మ్యాచుల్లోనూ..
లంకతో టీ20 సిరీస్లో తొలి మ్యాచ్లో రిషబ్ పంత్కు అవకాశం ఇచ్చారు. దీంతో సంజూ అభిమానులు టీమ్ మేనేజ్మెంట్ పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో అతడికి మిగిలిన రెండు టీ20ల్లోనూ ఛాన్స్ ఇచ్చారు. రెండో టీ20లో ఓపెనర్గా వచ్చిన అతడు తొలి బంతికే మహేశ్ తీక్షణ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక నామమాత్రమైన మూడో టీ20 మ్యాచులో వన్డౌన్లో వచ్చాడు. ఈ సారి నాలుగు బంతులు ఆడాడు. అయితే.. మరోసారి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరుకున్నాడు.
వాస్తవానికి తొలుత బ్యాటింగ్ చేసే సమయంలో ఎక్కువగా ఒత్తిడి ఉండదు. అయితే.. సంజూ మాత్రం అనవసరమైన ఒత్తిడిని మీద వేసుకుంటున్నాడని, ఈ క్రమంలోనే పెవిలియన్కు చేరుకుంటున్నారని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. బ్యాటింగ్లోనే కాదు వికెట్ కీపింగ్లో అతడు తేలిపోతుండడంతో ప్రస్తుతం అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది.
మ్యాచ్లో చివరి ఓవర్ గురించి సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సహచర ఆటగాళ్లపై ప్రశంసల జల్లు
ఐపీఎల్లో రాణించడంతో..
సంజూ శాంసన్ ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గా ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడి జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో వన్డే జట్టులో కాకుండా టీ20ల్లో అతడికి చోటు ఇచ్చారు. అయితే.. అంతర్జాతీయ మ్యాచ్లకు వచ్చే సరికి మాత్రం అతడు దారుణంగా విఫలం అవుతున్నాడు. గత 10 టీ20ల్లో అతడు ఒక్కసారి మాత్రమే హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అది కూడా జింబాబ్వే పై కావడం గమనార్హం. మూడు మ్యాచుల్లో డకౌట్లు అయ్యాడు. ప్రస్తుతం యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్న ఈ సమయంలో ఈ గణాంకాలతో సంజూ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టం. మరీ గంభీర్, సూర్య, జట్టు మేనేజ్మెంట్ సంజూ విషయంలో ఏం చేస్తుందో చూడాల్సిందే.