ఫ్రెండ్, బ్రదర్, లెజెండ్ అన్నీ కలగలిస్తే ధోనీ: హార్దిక్ పాండ్యా

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని అమాంతం పైకి లేపేస్తున్నాడు ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా.. మే7 మంగళవారం ముగిసిన మ్యాచ్‌లో ధోనీతో పాటు కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ.. మై ఇన్‌స్పిరేషన్, మై ఫ్రెండ్, మై బ్రదర్, మై లెజెండ్ అన్నీ కలిస్తే ధోనీ అంటూ ట్వీట్ చేశాడు. 

చెన్నైలోని చిదంబరం స్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ 6వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2019ఫైనల్‌కు అర్హత సాధించింది. చెన్నై నిర్దేశించిన 132పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో సూర్యకుమార్ యాదవ్(71; 54బంతుల్లో 10ఫోర్లు)కీలక ఇన్నింగ్స్‌తో మెప్పించాడు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ జోడీగా మ్యాచ్ ముగించారు. 

తన జట్టు ఫైనల్‌కు చేరిందన్న ఆనందంలో హార్దిక్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. సీజన్ మొత్తం ఆల్ రౌండర్ ప్రదర్శనతో చెలరేగిపోతున్న పాండ్యా సూపర్ ఫామ్‌లో కనిపిస్తున్నాడు. మరోవైపు రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ చేరాలని సూపర్ కింగ్స్ తీవ్రంగా శ్రమిస్తోంది.