Hardik Pandya : టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ఒకే ఒక భారత ఆటగాడు..
టీ20 క్రికెట్లో హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు.
- Thota Vamshi Kumar
- Published On : April 8, 2025 / 10:23 AM IST
Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్లో కెప్టెన్గా హార్దిక్ పాండ్యాకు ఏదీ కలిసి రావడం లేదు. అయినప్పటికి ప్లేయర్గా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. సోమవారం వాంఖడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయినప్పటికి ఈ మ్యాచ్లో పాండ్యా తొలుత బౌలింగ్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తరువాత బ్యాటింగ్లో కేవలం 15 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేశాడు.
కాగా.. బౌలింగ్లో రెండు వికెట్లు తీసిన తరువాత పాండ్యా ఓ అరుదైన ఘనతను సాధించాడు. టీ20ల్లో 5000 పరుగులు, 200 వికెట్లు పడగొట్టిన తొలి భారత ఆటగాడిగా హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్గా 12వ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. డ్వేన్ బ్రావో, షకీబ్ అల్ హసన్, ఆండ్రీ రస్సెల్, మహ్మద్ నబీ, సమిత్ పటేల్, కీరాన్ పొలార్డ్, రవి బొపారా, డేనియల్ క్రిస్టియన్, మోయిన్ అలీ, షేన్ వాట్సన్, మహ్మద్ హఫీజ్ లు పాండ్యా కన్నా ముందుగానే ఈ ఘనత సాధించారు.
టీ20ల్లో 5000 పరుగులు, 200 వికెట్లు తీసిన ప్లేయర్లు వీరే..
డ్వేన్ బ్రావో – 6970 పరుగులు, 631 వికెట్లు
షకీబ్ అల్ హసన్ – 7438 పరుగులు, 492 వికెట్లు
ఆండ్రీ రస్సెల్ – 9018 పరుగులు, 470 వికెట్లు
మహ్మద్ నబీ – 6135 పరుగులు, 369 వికెట్లు
సమిత్ పటేల్ – 6673 పరుగులు, 352 వికెట్లు
కీరన్ పొలార్డ్ – 13537 పరుగులు, 326 వికెట్లు
రవి బొపారా – 9486 పరుగులు, 291 వికెట్లు
డేనియల్ క్రిస్టియన్ – 5848 పరుగులు, 281 వికెట్లు
మొయిన్ అలీ – 7140 పరుగులు, 375 వికెట్లు
షేన్ వాట్సన్ – 8821 పరుగులు, 343 వికెట్లు
మహ్మద్ హఫీజ్ – 7946 పరుగులు, 202 వికెట్లు
హార్దిక్ పాండ్యా – 5390 పరుగులు, 200 వికెట్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి (67; 42 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సర్లు), రజత్ పాటీదార్ (64; 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు బాదగా జితేశ్ శర్మ (40 నాటౌట్; 19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బౌల్ట్, హార్దిక్ పాండ్యాలు చెరో రెండు వికెట్లు తీయగా.. విఘ్నేశ్ పుతూర్ ఓ వికెట్ సాధించాడు.
తిలక్ వర్మ (56; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్య (42; 15 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దంచికొట్టినా మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 9 వికెట్ల నష్టానికి 209 పరుగులకే పరిమితమైంది. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్యా నాలుగు వికెట్లు తీయగా, యశ్ దయాల్, జోష్ హేజిల్వుడ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్ ఓ వికెట్ సాధించాడు.
