ENG vs IND: అప్పట్లో ఆస్ట్రేలియా.. ఇప్పుడు టీమిండియా.. టెస్టుల్లో చెత్తరికార్డు నమోదు..

టెస్టు క్రికెట్‌లో టీమిండియా చెత్త రికార్డును నమోదు చేసుకుంది. అంతకుముందు ఈ చెత్త రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది.

Teamindia

ENG vs IND: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌లలో భాగంగా లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. ఈ టెస్టులో భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. సెంచరీల మోత మోగించారు. కానీ, ఫీల్డింగ్, బౌలింగ్‌లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన కనబర్చలేదు.

Also Read: IND vs END: తొలి టెస్టులో ఓటమి తరువాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన కామెంట్స్.. ఆ రెండు అంశాలే మా ఓటమికి కారణం..

టీమిండియా బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్‌లలో ఐదు సెంచరీలు సాధించారు. అయినప్పటికీ మ్యాచ్‌లో విజయం సాధించలేకపోయారు. రెండో ఇన్నింగ్స్‌లో 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఐదోరోజు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సునాయసంగా ఛేదించింది. దీంతో తొలి టెస్టులో విజయాన్ని అందుకుంది. ఇదే సమయంలో టెస్టు క్రికెట్‌లో టీమిండియా చెత్త రికార్డును నమోదు చేసుకుంది.

ఒక టెస్టు మ్యాచ్‌లో ఐదు సెంచరీలు చేసి ఓటమిపాలైన తొలి జట్టుగా భారత్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ ప్లేయర్లు ఐదు సెంచరీలు చేశారు. రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్ 134, రెండో ఇన్నింగ్స్‌లో 118 పరుగులు చేశాడు. యశస్వీ జైస్వాల్ తొలి ఇన్నింగ్స్‌లో 101, శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 147, కేఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో 137 పరుగులు. ఇలా రెండు ఇన్నింగ్స్‌లలో ఐదుగురు బ్యాటర్లు సెంచరీలు చేశారు. అయినా టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. అయితే, అంతకుముందు ఈ చెత్త రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 1928-29లో జరిగిన యాషెస్ మ్యాచ్‌లో నాలుగు సెంచరీలు చేసినప్పటికీ ఆ జట్టు ఓడిపోయింది. డాన్ బ్రాడ్‌మాన్ ఆ మ్యాచ్‌లో తన తొలి సెంచరీ చేశాడు.

టెస్ట్ మ్యాచ్‌లో 5వ రోజున అత్యధిక పరుగులు చేసిన జట్లు..
♦ 404 – ఆస్ట్రేలియా v ఇంగ్లాండ్, లీడ్స్(1948)
♦ 350 – ఇంగ్లాండ్ vs ఇండియా, లీడ్స్ (2025)
♦ 344 – వెస్టిండీస్ vs ఇంగ్లాండ్, లార్డ్స్ (1984)
♦ 325 – ఇండియా vs ఆస్ట్రేలియా, బ్రిస్బేన్ (2021)