India squad for Hong Kong Sixes 2025 named
Hong Kong Sixes 2025 : హాంకాంగ్ వేదికగా నవంబర్ 6 నుంచి 9 వరకు హాంకాంగ్ సిక్సర్ 2025 టోర్నీ జరగనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. భారత జట్టుకు దినేశ్ కార్తీక్ నాయకత్వం వహించనున్నాడు. తాజాగా ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు.
దినేశ్ కార్తీక్తో పాటు రాబిన్ ఊతప్ప, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, భరత్ చిప్లి, షాబాజ్ నదీమ్, ప్రియాంక్ పాంచల్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.
1992లో ఈ టోర్నీ (Hong Kong Sixes 2025) ప్రారంభమైంది. ఇందులో ఒక్కసారే 2005లో భారత జట్టు విజేతగా నిలిచింది. రెండు సార్లు రన్నరప్గా నిలిచింది. పాకిస్తాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలు తలా ఐదు సార్లు విజేతలుగా నిలవగా, శ్రీలంక జట్టు రెండు సార్లు ట్రోఫీని ముద్దాడింది. గత సీజన్లో ఉతప్ప సారథ్యంలో బరిలోకి దిగిన భారత్ పేలవ ప్రదర్శన చేసింది.
హాఫ్ సెంచరీ చేస్తే రిటైర్డ్ ఔట్..
ప్రపంచవ్యాప్తంగా హాంకాంగ్ క్రికెట్ సిక్సర్ టోర్నీ ఎంతో ఆదరణ పొందింది. ఒక్కొ టీమ్లో ఆరుగులు ప్లేయర్లు (మాజీ క్రికెటర్లు) ఉంటారు. ఇన్నింగ్స్కు ఆరు ఓవర్లు ఉంటాయి. నో బాల్కు ఫ్రీ హిట్లు ఉండవు. ఒక బ్యాటర్ హాఫ్ సెంచరీ చేస్తే రిటైర్డ్ ఔట్ అవుతాడు.
హాంకాంగ్ సిక్సర్ 2025 టోర్నీలో పాల్గొనే జట్లు ఇదే..
భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్, నేపాల్, ఇంగ్లాండ్, యూఏఈ, కువైట్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ (చైనా) ఈసారి టోర్నీలో భాగం కానున్నాయి.
పూల్- ‘ఎ’ లో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్, నేపాల్ ఉండగా.. పూల్- ‘బి’లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, యూఏఈ లు ఉన్నాయి. పూల్- ‘సి’ లో భారత్, పాకిస్తాన్, కువైట్ ఉండగా పూల్- ‘డి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ లు ఉన్నాయి.
భారత జట్టు ఇదే..
దినేశ్ కార్తిక్ (కెప్టెన్), రాబిన్ ఊతప్ప, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, భరత్ చిప్లి, షాబాజ్ నదీమ్, ప్రియాంక్ పాంచల్.