Amit Patel
విలాసవంతమైన జీవితం గడిపేందుకు అమెరికాలో నివాసం ఉంటున్న ఓ ప్రవాస భారతీయుడు దారుణానికి తెగబడ్డాడు. తాను పని చేస్తున్న ఫుట్బాల్ ఫ్రాంచైజీని మోసం చేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 22 మిలియన్ల అమెరికన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.183 కోట్ల మేర మోసం చేశాడు.
వివరాల్లోకి వెళితే..
జాక్సన్విల్లే జాగ్వార్స్ అనేది అమెరికాలోని పాపులర్ ఫుట్బాల్ జట్లలో ఒకటి. ఈ ఫ్రాంచైజీకి 2018 నుంచి 2023 వరకు ఎగ్జిక్యూటివ్గా అమిత్ పటేల్ పని చేశాడు. అతడు ప్రాంఛైజీ కన్నుగప్పి జట్టు ఖజానా నుంచి 22 మిలియన్ల మేర మోసానికి పాల్పడ్డాడు. ఈ నగదుతో అతడు ఫ్లోరిడాలో ఓ భారీ భవనం కొనుగోలు చేశాడు. అంతేకాదండోయ్ అతడు ఎక్కడికైనా వెళ్లాలంటే ఛార్టర్డ్ ఫ్లైట్లోనే వెళ్లేవాడు. ఖరీదైన గడియారాలు, టెస్లా కారు వంటి వాటిని కొన్నాడు. మోసం చేసిన డబ్బుతో విహార యాత్రలు చేశాడు.
Team India : దక్షిణాఫ్రికా చేరుకున్న టీమ్ఇండియా.. ఎలాంటి స్వాగతం లభించిందో చూడండి.. వీడియో
ఎలా మోసం చేశాడంటే..?
అమిత్ పటేల్ జాగ్వార్స్ ఫుట్బాల్ ఫ్రాంచైజీలో ఆర్థిక విశ్లేషణ, ప్లానింగ్ టీమ్కు మేనేజర్గా విధులు నిర్వర్తించేవాడు. కాగా.. ఈ సంస్థ తన ఉద్యోగుల కోసం వర్చువల్ క్రెడిట్ కార్డు ప్రవేశపెట్టింది. దీన్ని గమనించిన అమిత్ పటేల్ భారీ మోసానికి తెరలేపాడు. విమాన చార్జీలు, హోటల్ బిల్లలు, క్యాటరింగ్ వంటి వాటి మొక్క నకిలీ బిల్లులను సృష్టించేవాడు. ఇలా 2019 నుంచి చేయడం సంస్థను మోసం చేయడం ప్రారంభించాడు.
ఈ డబ్బును ఆన్లైన్ పందెలు, క్రిప్టోకరెన్సీలు కొనుగోలు చేయడంతో పాటు విలాసవంతమైన జీవనాన్ని గడిపేందుకు ఉపయోగించుకున్నాడు. ఇలా దాదాపు 22 మిలియన్ డాలర్లు కొట్టేశాడు. చేసిన మోసం ఎక్కువ కాలం దాగదు అంటారు గదా అలా అతడి మోసం కూడా బయటపడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సదరు ఫ్రాంచైజీ అతడి ఉద్యోగాన్ని తీసివేసింది. కోర్టులో అతడిపై కేసు వేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఈ మోసానికి అతడు ఒక్కడే పాల్పడ్డాడని, సంస్థలోని మిగిలిన ఉద్యోగులు ఎవరూ కూడా అతడికి సహకరించలేదని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.