PCB : పాక్ బోర్డా మజాకానా.. టీ20 ప్రపంచకప్లో పేలవ ప్రదర్శన.. ఒక్కొ ఆటగాడికి 5 మిలియన్ల జరిమానా!
టీ20 ప్రపంచకప్ 2026లో ఘోరంగా విఫలం కావడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ జట్టుపై ఆగ్రహంగా ఉంది.
PCB T20 World Cup 2026 report
- టీ20 ప్రపంచకప్లో సెమీస్ చేరని పాకిస్థాన్
- పీసీబీ ఆగ్రహం
- ఒక్కొ ప్లేయర్కు 5 మిలియన్లు జరిమానా
PCB : టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ సెమీస్కు చేరకుండానే నిష్ర్కమించింది. ఈ మెగా టోర్నీలో ఆ జట్టు ఘోరంగా విఫలం కావడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆటగాళ్లకు భారీ షాక్ ఇచ్చిందట. ఒక్కో ప్లేయరకు పాకిస్థాన్ కరెన్సీలో 5 మిలియన్లు (అంటే భారత కరెన్సీలో 16.28లక్షలో) జరిమానాగా విధించినట్లు వార్తలు వస్తున్నాయి.
టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ గ్రూప్-ఏలో ఉంది. పాక్ తో పాటు భారత్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్లు కూడా గ్రూప్-ఏలో ఉన్నాయి. గ్రూప్ దశలో భారత్ చేతిలో పాక్ చిత్తుగా ఓడిపోయింది. అయితే.. అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా జట్లపై విజయాలను సాధించడంతో సూపర్-8కి అర్హత సాధించింది.
Sunil Gavaskar : ఐసీసీపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం.. ఇలాంటివి అవసరమా..
సూపర్-8లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంకలతో కలిసి పాకిస్థాన్ గ్రూప్-2లో ఉంది. అయితే.. న్యూజిలాండ్తో జరగాల్సిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో సెమీస్లో నిలవాలంటే శ్రీలంక పై 65 పరుగుల తేడాతో గెలుపొందాల్సి ఉండగా.. పాక్ కేవలం 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఆ జట్టు సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్ర్కమించింది. గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లు సెమీస్కు చేరుకున్నాయి.
ఇలా పాక్ టోర్నీలో పేలవ ప్రదర్శన చేయడంతో ఆటగాళ్లకు జరిమానా విధించినట్లు ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది. ఒక్కో ఆటగాడికి పాక్ కరెన్సీలో 5 మిలియన్లు ఫైన్గా వేసినట్లు చెప్పింది. భారత్ పై మ్యాచ్ ఓడిపోగానే ఈ మేరకు ఆటగాళ్లకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. వార్షిక కాంట్రాక్టులో అత్యధిక వేతనం అందుకుంటున్న ఆటగాళ్లకు ఈ జరిమానా ఇంకా ఎక్కువగానే ఉండనున్నట్లు చెప్పింది.
టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొన్న పాక్ జట్టు ఇదే..
సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), బాబర్ ఆజామ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ మీర్జా, అబ్రార్ అహ్మద్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫే, నసీమ్ షా, ఉస్మాన్ తారిఖ్.
