Commonwealth Games 2026 : కామన్వెల్త్ గేమ్స్ 2026.. పతకాల సంఖ్య తగ్గినా… భారత ప్రదర్శన అసాధారణమే!
కామన్వెల్త్ గేమ్స్ 2026 (Commonwealth Games 2026) ముగిశాయి. భారత్ మొత్తం 39 పతకాలను సాధించింది
- Thota Vamshi Kumar
- Published on- August 3, 2026 / 09:58 AM IST
Indias Commonwealth Games 2026 Medal Tally Lowest In 24 Years
Commonwealth Games 2026 : కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగిశాయి. భారత్ మొత్తం 39 పతకాలను సాధించింది. ఇందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. 1998 కౌలాలంపూర్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ తరువాత తొలిసారిగా భారత్ 50 పతకాల మార్క్ను దాటలేకపోవడం ఇదే తొలిసారి. 2002 మాంచెస్టర్ గేమ్స్లో 69 పతకాలు సాధించిన తర్వాత, గత 24 ఏళ్లలో ఇదే అత్యల్ప పతకాల సంఖ్య.
అయితే.. కేవలం పతకాల సంఖ్య ఆధారంగా గ్లాస్గో 2026లో భారత ప్రదర్శనను అంచనా వేయడం సరైంది కాదు. ఈసారి భారత్ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ, పరిమిత అవకాశాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.
10 క్రీడలకే పరిమితమైన కామన్వెల్త్ గేమ్స్..
నాలుగు సంవత్సరాల క్రితం బర్మింగ్హామ్లో జరిగిన 19 క్రీడలతో పోలిస్తే ఆర్థిక పరిమితుల కారణంగా ఈ సారి కేవలం 10 క్రీడలకు మాత్రమే పరిమితం చేశారు.
భారత్కు సంప్రదాయంగా అత్యధిక పతకాలు అందించే షూటింగ్ (135 పతకాలు), రెజ్లింగ్ (114 పతకాలు), బ్యాడ్మింటన్ (31 పతకాలు), టేబుల్ టెన్నిస్ (28 పతకాలు), హాకీ (6 పతకాలు) వంటి క్రీడలను తొలగించారు. ఈ ఐదు క్రీడల్లోనే భారత్ 2022 బర్మింగ్హామ్ గేమ్స్లో 61 పతకాలలో 30 పతకాలు, అందులో 13 స్వర్ణ పతకాలు గెలుచుకుంది. అంటే భారత్కు అత్యధిక పతకాలు అందించే క్రీడలే లేకుండా ఈసారి బరిలోకి దిగాల్సి వచ్చింది.
అయినా నాలుగో స్థానంలో భారత్..
అయినప్పటికీ భారత బృందం నిరుత్సాహపడకుండా మిగిలిన క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. మొత్తం పతకాల పట్టికలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా తర్వాత నాలుగో స్థానంలో నిలిచింది. భారత్, ఆతిథ్య దేశమైన స్కాట్లాండ్ రెండూ 39 పతకాలు సాధించినప్పటికీ, ఎక్కువ రజత పతకాలు ఉండటంతో భారత్ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
10 క్రీడల్లో పాల్గొని సగటున ప్రతి క్రీడకు 3.9 పతకాలు సాధించడం భారత కామన్వెల్త్ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది.
బాక్సింగ్లో అదుర్స్..
ఈ సారి భారత బాక్సర్లు చరిత్ర సృష్టించారు. మొత్తం 14 మంది బాక్సర్లలో 10 మంది పతకాలు గెలిచారు. ఇందులో 7 స్వర్ణాలు, 3 రజతాలు ఉన్నాయి. మహిళా బాక్సర్లలో ప్రీతి పవార్, జైస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఘంగాస్, అరుంధతి చౌదరిలు ఐదు స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. పురుషుల విభాగంలో సచిన్ సివాచ్, అంకుష్ పంఘల్ స్వర్ణాలను సాధించారు.
జూడోలో చరిత్ర..
భారతదేశ విజయం కేవలం బాక్సింగ్కే పరిమితం కాలేదు. జూడో క్రీడాకారులు మ్యాట్పై అద్భుతమైన విజయాలు సాధించారు. హర్ష్ సింగ్ (పురుషుల -60 కేజీల విభాగం), అస్మిత దే (మహిళల -48 కేజీల విభాగం) జూడోలో భారతదేశానికి మొట్టమొదటి కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతకాలను సాధించిపెట్టారు. యమిని మౌర్య (రజతం), ఉన్నతి శర్మ (కాంస్యం) పతకాలు సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో ఇప్పటివరకు భారతదేశం అత్యుత్తమ జూడో ప్రదర్శన ఇదే.
Shreyanka Patil : పొట్టి డ్రెస్లో భారత మహిళా క్రికెటర్.. శ్రేయాంక పాటిల్ ఫోటోలు వైరల్..
వాస్తవానికి.. అథ్లెటిక్స్, పారా-అథ్లెటిక్స్ రెండూ కలిసి మొత్తం 16 పతకాలను సాధించాయి.
నీరజ్ చోప్రా పురుషుల జావెలిన్ త్రోలో రజత పతకం సాధించి కామన్వెల్త్ క్రీడల వేదికపైకి తిరిగి వచ్చాడు. గుల్వీర్ సింగ్ 10,000 మీటర్ల పరుగులో రజతం, 5,000 మీటర్ల పరుగులో కాంస్యం సాధించి, ఒకే కామన్వెల్త్ క్రీడలలో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ట్రాక్ అథ్లెట్గా నిలిచాడు. తేజస్విన్ శంకర్ డెకాథ్లాన్లో కాంస్యం సాధించి, ఈ క్రీడలలో భారతదేశానికి మొట్టమొదటి పతకాన్ని అందించాడు.
షర్మిలా ధంకర్, దిలీప్ మహాదు గావిత్, సోమన్ రాణాల స్వర్ణ ప్రదర్శనలతో ఏడు పతకాలను గెలుచుకున్న పారా-అథ్లెట్లు, ఒకే ఎడిషన్లో భారతదేశం యొక్క చారిత్రక CWG పారా-క్రీడల సంయుక్త పతకాల సంఖ్యను సమం చేశారు.
మరోవైపు.. భారతదేశపు ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను, మహిళల 48 కేజీల విభాగంలో వరుసగా మూడవ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడం ద్వారా వెయిట్లిఫ్టింగ్లో ఎనిమిది పతకాల పంటకు నాయకత్వం వహించారు. జట్టు మొత్తం ఆరు రజత పతకాలు, ఓ కాంస్య పతకాన్ని కూడా సాధించారు.
పతకాల కంటే గొప్ప విజయమే..
1998 తరువాత 39 పతకాలు అనేది.. సంఖ్యాపరంగా తక్కువగా కనిపించినప్పటికీ, పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఇది భారత క్రీడా చరిత్రలో అత్యంత విలువైన ప్రదర్శనల్లో ఒకటి. భారత్కు ఎక్కువ పతకాలు తెచ్చిపెట్టే క్రీడలు లేకుండానే కొత్త క్రీడల్లో మెరుగైన ఫలితాలు సాధించి, తన సామర్థ్యాన్ని నిరూపించింది. ఈ ప్రదర్శన భవిష్యత్తులో భారత బహుళ క్రీడల అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందనే ఆశాభావాన్ని కలిగిస్తోంది.
