టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనతను సాధించాడు. గురువారం డిసెంబర్ 14న దక్షిణాఫ్రికాతో జోహన్నెస్బర్గ్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచులో అతడు దీన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్లో 2.5 ఓవర్లు వేసిన కుల్దీప్ యాదవ్ 17 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. కాగా.. టీ20 క్రికెట్లో కుల్దీప్ యాదవ్కు ఇదే అత్యుత్తమ గణాంకాలు. ఇందులో విశేషం ఏంటంటే అతడి పుట్టిన రోజు నాడే దీన్ని సాధించడం.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో బర్త్ డే రోజునే ఐదు వికెట్లు తీసిన మొదటి ఆటగాడిగా కుల్దీప్ యాదవ్ రికార్డులకు ఎక్కాడు. డిసెంబర్ 14న కుల్దీప్ యాదవ్ 29వ వసంతంలోకి అడుగుపెట్టాడు. కాగా.. పుట్టిన రోజు నాడే అత్యుత్తమ ప్రదర్శన చేసి ఆటగాళ్ల జాబితాలో కుల్దీప్ యాదవ్ తరువాత శ్రీలంక ఆటగాడు హసరంగ ఉన్నాడు. అతడు నాలుగు వికెట్లు పడగొట్టాడు.
IND vs SA : డేవిడ్ మిల్లర్కు అంపైర్ సాయం..! ఔటైనా నాటౌట్.. వీడియో వైరల్
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమ్ఇండియా తొలుత బ్యాటింగ్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ (100; 56 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (60; 41బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, విలియమ్స్ చెరో రెండు వికెట్లు తీశారు. షంసీ, బర్గర్ తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు 13.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ (35), మార్క్రమ్ (25)లు ఫర్వాలేదనిపించగా మిగిలిన వారు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమార్లు తలా ఓ వికెట్ సాధించారు.
AUS vs PAK : బాల్లో బీసీసీఐ చిప్ పెట్టింది..! అందుకే పాక్ ఆటగాళ్లు ఇలా..