Mitchell Santner Comments after New Zealand lost 1st T20 to India
IND vs NZ : ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నాగ్పూర్ వేదికగా భారత్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్ 48 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ఓటమిపై కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యం కారణంగానే తాము ఓడిపోయినట్లుగా చెప్పుకొచ్చాడు. లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోవడం కూడా తమ ఓటమికి గల కారణాలలో ఒకటి అని తెలిపాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీమ్ఇండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ (84; 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. రింకూ సింగ్ (44 నాటౌట్; 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టగా సూర్యకుమార్ (32; 22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్య (25; 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ, కైల్ జేమీసన్ లు చెరో రెండు వికెట్లు తీశారు. క్రిస్టియన్ క్లార్క్, ఇష్ సోధి, మిచెల్ సాంట్నర్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
Shreyanka Patil : ఆర్సీబీ ప్లేయర్ శ్రేయాంక పాటిల్ ఫోటోలు వైరల్
అనంతరం 239 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (78; 40 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు), మార్క్ చాప్మన్ (39; 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా మిగిలిన వారు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబె లు చెరో రెండు వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్ లు తలా ఓ వికెట్ సాధించారు.
మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. తమ జట్టు ఓటమికి గల కారణాలు వెల్లడించాడు. మ్యాచ్ ఓడిపోయినప్పటికి కూడా అద్భుతమైన ప్రాక్టీస్ లభించిందన్నాడు. ‘వాస్తవానికి ఈ మ్యాచ్లో గెలవాలని అనుకున్నాము. ఏదీ ఏమైనప్పటికి మంచి ప్రాక్టీస్ లభించింది. గత రెండేళ్లుగా భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. సొంతగడ్డపై ఆ జట్టు ఎంతటి ప్రమాదకారో అందరికి తెలుసు. ఈ మ్యాచ్లో భారత్ చాలా గొప్పగా ఆడింది. గెలుపుకు నిజంగా వారు అర్హులు. ‘అని సాంట్నర్ అన్నాడు.
KKR : కేకేఆర్ ఫీల్డింగ్ కోచ్గా దిశాంత్ యాగ్నిక్..
ఇక ఈ మ్యాచ్ లో తాము ఓడిపోయినప్పటికి కూడా తమకు ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయన్నాడు. గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్ అద్భుతంగా ఆడారు. లక్ష్య ఛేదనలో రెండు వికెట్లు కోల్పోయినప్పటికి తిరిగి పుంజుకున్న తీరు బాగుందన్నాడు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ భారత బౌలర్లు తమను ఒత్తిడిలోకి నెట్టారని చెప్పుకొచ్చాడు.
భారత్ లాంటి జట్టును ఒకటి రెండు డాట్ బాల్స్ వేసి ఒత్తిడి పెంచే అవకాశం నిజంగా లేదు. బ్యాటర్ల వేగాన్ని తగ్గించడానికి వికెట్లు తీయడమే ఏకైక మార్గం అని చెప్పుకొచ్చాడు. ఇక టీమ్ఇండియా బ్యాటర్లు స్పిన్నర్లను టార్గెట్ చేయడంతోనే ఆఖరి ఓవర్ను డారిల్ మిచెల్లో వేయించాల్సి వచ్చిందని చెప్పాడు. ఇక తాను 8 స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు ఇష్టపడుతానని చెప్పుకొచ్చాడు. కొంత మంది ఆటగాళ్లు ఫ్రాంఛైజీ లీగ్లలో ఆడుతుండడంతో వారు ఇంకా జట్టులో చేరాల్సి ఉందన్నాడు.