New Zealand Head Coach Gary Stead Key comments ahead of IND vs NZ
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్కు ముందు న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్లో తమకు టీమ్ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నుంచి భారీ ముప్పు పొంచిఉందన్నాడు.
గ్రూప్ స్టేజీలో భారత్ తో జరిగిన మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో రాణించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఫైనల్ మ్యాచ్లో కూడా అతడు ఖచ్చితంగా ఆడతాడని తాము భావిస్తున్నట్లు తెలిపాడు. అతడిని ఎలా ఎదుర్కొనాలా అనే విషయాలపై ప్రస్తుతం తాము ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
దుబాయ్ వేదికగానే భారత జట్టు అన్ని మ్యాచ్లు ఆడుతుండగా.. ఇది అడ్వాండేజ్ అంటూ చాలా మంది చేస్తున్న వ్యాఖ్యలను కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్ పట్టించుకోలేదు. దానికి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదన్నాడు. దుబాయ్లో భారత్తో తాము ఓ మ్యాచ్లో ఆడామని, ఆ మ్యాచ్ ద్వారా ఇక్కడి పరిస్థితుల గురించి ఓ అవగాహన వచ్చిందన్నాడు.
IND vs NZ : టీమ్ఇండియా ఫైనల్ మ్యాచ్లో ఓడిపోతే కోట్లలో నష్టం..
టోర్నీ ప్రారంభంలో ఎనిమిది జట్లు ఉన్నాయని, అయితే.. ఇప్పుడు రెండు జట్లు మాత్రమే మిగిలాయన్నాడు. ఫైనల్స్కు చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. ఇక ఫైనల్ మ్యాచ్ను కూడా ఓ సాధారణ మ్యాచ్లాగానే పరిగణిస్తామని వెల్లడించాడు. ఆదివారం బాగా ఆడి ఫైనల్ మ్యాచ్లో భారత్ పై గెలిచి విజేతగా నిలిస్తే.. నిజంగా ఇంకా ఎక్కువగా ఆనందపడతామని చెప్పుకొచ్చాడు.
షెడ్యూల్ పై మాట్లాడుతూ.. లాహోర్లో మ్యాచ్ ఆడిన తరువాత ఇక్కడికి (దుబాయ్)కి వచ్చాం. రోజంతా ప్రయణంలోనే గడిపాము. ఇది ఒక రకంగా ఇబ్బందే. అయితే.. మ్యాచ్కు సన్నద్ధం అయ్యేందుకు చాలినంత సమయం దొరికింది. కొన్ని సార్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు అని గ్యారీ స్టీడ్ అన్నారు.
ఇక పేసర్ మాట్ హెన్రీ గాయం పైనా గ్యారీ స్టీడ్ స్పందించాడు. ఇది నిరుత్సాహపరుస్తోందన్నాడు. అయితే.. సానుకూల అంశం ఏమిటంటే అతడు మళ్లీ బౌలింగ్ చేయడం ప్రారంభించినట్లు తెలిపాడు. ఇంకా కొన్ని స్కాన్లు చేయాల్సి ఉంది. అదే సమయంలో ఈ 33 ఏళ్ల ఆటగాడు భారత్తో మ్యాచ్ ఆడేందుకు తాము చేయాల్సిందంతా చేస్తామని చెప్పాడు.
IND vs NZ : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు ముందు దుబాయ్ పోలీసుల వార్నింగ్..
కాగా.. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్ మ్యాచ్లో క్యాచ్ అందుకునే క్రమంలో హెన్రీ భుజానికి గాయమైంది. ఇక ఈ ఆటగాడు గ్రూప్ స్టేజీలో భారత్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్లతో సత్తా చాటిన సంగతి తెలిసిందే.