Pakistan Cricket: ఇండియాపై మూడుసార్లు ఓడిపోయారు.. సిగ్గు లేదు.. మళ్లీ మీకు… ప్లేయర్లపై భారీ రివేంజ్ తీర్చుకున్న పాక్ క్రికెట్ బోర్డు
Pakistan Cricket: పాకిస్థాన్ ఆటగాళ్లపై పీసీబీ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ‘నో అబ్జక్షన్ సర్టిఫికెట్’ను జారీ చేయకూడదని నిర్ణయించింది.
- Harishth Thanniru
- Published On : October 1, 2025 / 12:44 PM IST
Pakistan Cricket
Pakistan Cricket: పాకిస్థాన్ ఆటగాళ్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇక నుంచి అన్ని విషయాల్లో ఆటగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనంతటికీ కారణంగా ఆసియా కప్ టోర్నీలో భారత్ జట్టుపై వరుసగా మూడు సార్లు ఓడిపోవటమేనని పాకిస్థాన్ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇంతకీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆటగాళ్లపై ఎలాంటి ఆంక్షలు విధించిందనే విషయాలను పరిశీలిస్తే..
ఆసియా కప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా ఆసియా కప్ -2025 ట్రోఫీని భారత్ గెలుచుకుంది. అయితే, ఇదే టోర్నీలో లీగ్ దశలో, సూపర్ -4 దశలో ఇరు జట్లు తలపడగా.. టీమిండియా విజయం సాధించింది. మొత్తం మూడు మ్యాచ్ లు ఇరు జట్ల మధ్య జరగ్గా.. అన్ని మ్యాచ్ లలోనూ టీమిండియా విజయం సాధించింది.
ముఖ్యంగా ఫైనల్లో ఓటమి తరువాత పాకిస్థాన్ క్రికెటర్లపై ఆ దేశంలోని క్రికెట్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీం సభ్యుల సెలెక్షన్ పైనా ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. అన్నివైపుల నుంచి పాకిస్థాన్ క్రికెటర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్న క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుసైతం వారిపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది.
Also Read : Asia Cup Trophy: అప్పుడేమో ఆసియా కప్ ట్రోఫీ ఎత్తుకుపోయాడు.. ఇప్పుడు ఇస్తాడట.. కానీ..
ESPNcricinfo నివేదిక ప్రకారం.. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ ఓటమి తరువాత.. ఆటగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయించింది. ఇక నుంచి విదేశీ క్రికెట్ లీగుల్లో పాల్గొనేందుకు పాక్ అటగాళ్లకు అవకాశం ఇవ్వొద్దని.. అందుకోసం నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ను జారీ చేయకూడదని పీసీబీ నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పీసీబీ ఆపరేషన్స్ చీఫ్ సుమైర్ అహ్మద్ సయ్యద్ ఆటగాళ్లకు, వారి ఏజెంట్లకు నోటీసులు జారీ చేశారు. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న టీ20 ప్రాంచైజీ టోర్నమెంట్లలో కూడా పాకిస్థాన్ ఆటగాళ్లు పాల్గొనే అవకాశం ఉండదు.
లీగ్లు, ఇతర విదేశీ టోర్నమెంట్లలో పాల్గొనడానికి సంబంధించి ఆటగాళ్లకు నిరభ్యంతర సర్టిఫికెట్లు (ఎన్ఓసీలు) ఇవ్వడం నిలిపివేయబడ్డాయని పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ పేర్కొన్నారు. తక్షణమే అది అమల్లోకి వస్తుందని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
బాబర్ అజామ్, షాహీన్ అఫ్రీదితోపాటు ఏడుగురు పాకిస్థాన్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా బిగ్బాష్ లీగ్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఐఎల్టీ20 లీగ్లో వేలానికి 16మంది పాకిస్థాన్ ఆటగాళ్లు సంతకాలు చేశారు. ప్రస్తుతం వీరంతా ఆ లీగ్లలో ఆడే అవకాశాలు కోల్పోనున్నట్లు తెలుస్తోంది. అయితే, కొందరు ఆటగాళ్లు పీసీబీ నిర్ణయంపట్ల అభ్యంతరం తెలుపుతున్నట్లు సమాచారం. మొత్తానికి ఇండియా కొట్టిన దెబ్బకు పాకిస్థాన్ ఆటగాళ్ల ఆర్థిక వనరులపై దెబ్బపడిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
