Ruturaj Gaikwad : 10 పరుగులే చేసినా.. చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్.. ఒకే ఒక్కడు
Ruturaj Gaikwad creates History : టీమ్ఇండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనతను సాధించాడు.
- Thota Vamshi Kumar
- Published On : December 4, 2023 / 02:57 PM IST
Ruturaj Gaikwad creates History
టీమ్ఇండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనతను సాధించాడు. బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20 మ్యాచులో అతడు దీన్ని అందుకున్నాడు. టీ20 ద్వైపాక్షిక సిరీసుల్లో ఆస్ట్రేలియా పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. అంతకముందు ఈ రికార్డు న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ పేరిట ఉండేది. 2021లో గప్టిల్ ఆసీస్తో జరిగిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో 218 పరుగులు చేశాడు.
ఆదివారం బెంగళూరు మ్యాచులో రుతురాజ్ 10 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయినప్పటికీ ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో రుతురాజ్ 55.75 సగటుతో 223 పరుగులు సాధించాడు. వైజాగ్లో జరిగిన మొదటి టీ20 మ్యాచులో డైమండ్ డక్ అయిన రుతురాజ్ రెండో టీ20 మ్యాచులో అర్ధశతకం(58)తో రాణించగా, మూడో మ్యాచులో భారీ శతకంతో(123నాటౌట్) చెలరేగాడు. ఇక నాలుగో మ్యాచులో 32 పరుగులే చేశాడు.
మొత్తంగా చూసుకుంటే కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తరువాత ఒకే సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన మూడో భారత ఆటగాడిగా రుతురాజ్ నిలిచాడు.
Shaheen Afridi : ఆ కారణం చేతనే బ్యాగులు మోశాం.. లేదంటేనా..? : పాకిస్తాన్ పేసర్ షాహీన్ అఫ్రిది
సిరీస్ మనదే..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ ( 53; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకం బాదాడు. మిగిలిన వారిలో అక్షర్ పటేల్ (31), జితేశ్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (21) లు రాణించగా సూర్యకుమార్ యాదవ్ (5), రింకూ సింగ్ (6), రుతురాజ్ గైక్వాడ్ (10)లు విఫలం అయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ డార్వాయిస్, జాసన్ బెహ్రెన్డార్ఫ్ లు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. తన్వీర్ సంఘ, ఆరోన్ హార్డీ, నాథన్ ఎల్లిస్ లు ఒక్కొ వికెట్ తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో బెన్ మెక్డెర్మాట్ (54; 36 బంతుల్లో 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించినా ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. ఆఖర్లో మాథ్యూ వేడ్(22 15 బంతుల్లో 4 ఫోర్లు) పోరాడినా ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత బౌలర్లలో ముఖేశ్ కుమార్ మూడు వికెట్లు తీశాడు. అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్కు ఓ వికెట్ దక్కింది.
