Sourav Ganguly : రాత్రి 7.30 గంటలకే భారత్ టీ20 ప్రపంచకప్ గెలిచింది.. న్యూజిలాండ్ చేసిన అతి పెద్ద తప్పు ఇదే.. సౌరవ్ గంగూలీ హాట్ కామెంట్స్
టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ వ్యూహాత్మక తప్పిదం చేసిందని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) అన్నాడు.
India Won T20 World Cup Final By 7:30 PM says Sourav Ganguly
Sourav Ganguly : టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ వ్యూహాత్మక తప్పిదం చేసిందని, అదే ఆ జట్టు ఓటమికి కారణం అని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడం తనను ఆశ్చర్యపరిచిందన్నాడు.
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్న జట్టును తొలుత బ్యాటింగ్ చేయమనడం ద్వారా కివీస్ ఓటమి ఖరారు అయిందన్నాడు. అందుకనే రాత్రి 7.30 గంటలకే కివీస్ ప్రపంచకప్ను కోల్పోయిందన్నాడు.
‘ఫైనల్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమై 7:30 గంటలకు ముగిసింది. నాతో పాటు చూస్తున్న వారికి కూడా నేను అదే చెప్పాను. భారత జట్టు బ్యాటింగ్ను చూడండి.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, శివం దూబె, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్తో బలంగా ఉంది. ఇలాంటి విధ్వంసకర బ్యాటర్లను ముందుగా బ్యాటింగ్ కు పంపడం కివీస్ చేసిన అతి పెద్ద తప్పు. ఆపై ఎంతటి లక్ష్యాన్ని అయినా కాపాడుకునే బుమ్రా వారికి ఉన్నాడు.’ అని గంగూలీ అన్నాడు.
గౌతమ్ గంభీర్ మార్గనిర్దేశ్యంలో భారత జట్టు మరిన్ని విజయాలను సాధిస్తుందని గంగూలీ తెలిపాడు. వైట్ బాల్ కోచ్గా గంభీర్ పనితీరు బాగుంది. ‘అతనికి చాలా మంచి జట్టు ఉంది. అతను ఫార్మాట్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు. అతని రికార్డు చాలా ఆకట్టుకుంటుంది. 12 నెలల్లో ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ కప్ గెలిచాడు. కోచ్గా అతడి నుంచి మీరు ఇంకేం ఆశిస్తున్నారు.’ అని గంగూలీ ప్రశ్నించాడు.
BAN vs PAK : బంగ్లాదేశ్ చేతిలో ఓటమి.. పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ కీలక వ్యాఖ్యలు..
ఇక దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే ప్రపంచకప్ 2027.. కోచ్గా గంభీర్కు సవాల్ అని అన్నాడు. అక్కడ బంతి సీమింగ్ తో పాటు బౌన్స్ ఉంటుందన్నాడు. అయితే.. ఆ సవాల్ను గంభీర్ స్వీకరిస్తాడు అని తనకు తెలుసు అని చెప్పాడు. అతడు ప్లేయర్ల పట్ల ఆసక్తి చూపడని, జట్టు ప్రయోజనాలే అతడికి ముఖ్యమన్నాడు. అతడు చూసేందుకు కఠినంగా అనిపించవచ్చునని, అయితే.. అతడు చాలా మంచివాడని వాడు అని గంగూలీ చెప్పాడు.
