Suryakumar Yadav : దూబెను మూడో స్థానంలో ఆడించడం పై సూర్యకుమార్ యాదవ్ కామెంట్స్.. ఏదో అనుకున్నాం.. కానీ..
శివమ్ దూబెను బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో పంపించడానికి గల కారణాలను సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వెల్లడించాడు.
- Thota Vamshi Kumar
- Published On : September 25, 2025 / 07:48 AM IST
Suryakumar Yadav explains Why Shivam Dube bat at number 3 against Bangladesh
Suryakumar Yadav : ఆసియాకప్ 2025లో భారత్ ఫైనల్కు దూసుకువెళ్లింది. సూపర్-4లో బుధవారం దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ (75; 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. హార్దిక్ పాండ్యా (38; 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), శుభ్మన్ గిల్ (29; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్ రెండు వికెట్లు తీశాడు. తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్, సైఫుద్దీన్ లు తలా ఓ వికెట్ సాధించారు.
Vaibhav Suryavanshi : చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. యూత్ వన్డేల్లో సిక్సర్ల కింగ్..
అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా బ్యాటర్లలో సైఫ్ హసన్ (69; 51 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించాడు. మిగిలిన వారు విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా, వరున్ చక్రవర్తిలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, తిలక్ వర్మలు చెరో వికెట్ సాధించారు.
శివమ్ దూబెకు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఎందుకంటే.?
సాధారణంగా టీ20 క్రికెట్లో వన్డౌన్లో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వస్తూ ఉంటాడు. అయితే.. బంగ్లాదేశ్తో మ్యాచ్లో శివమ్ దూబేను మూడో స్థానంలో ఆడించారు. అయితే.. ఈ ప్రయోగం బెడిసి కొట్టింది. మూడు బంతులు ఎదుర్కొన్న దూబె కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి రిషద్ హుస్సేన్ బౌలింగ్లో తంజిమ్ హసన్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు.
కాగా.. బ్యాటింగ్ ఆర్డర్లో దూబెను మూడో స్థానంలో పంపించడానికి గల కారణాలను మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. స్పిన్ బౌలర్ల పై అతడు ఎదురుదాడికి దిగుతాడని భావించే అతడికి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ ఇచ్చినట్లు వెల్లడించాడు. అయితే.. తమ ప్లాన్ వర్కౌట్ కాలేదని చెప్పుకొచ్చాడు.
‘వాస్తవానికి ఈ టోర్నీలో ఎక్కువగా ఫస్టు బ్యాటింగ్ చేసే అవకాశాలు రాలేదు. ఒక్క ఒమన్తో మ్యాచ్లో మాత్రమే మేం తొలుత బ్యాటింగ్ చేశాం. సూపర్-4లో తొలుత బ్యాటింగ్ చేసి మా బ్యాటింగ్ సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాం. బంగ్లా బౌలింగ్ లైనప్లో లెఫ్టార్మ్ స్పిన్నర్తో పాటు లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. దీంతో 7-15 ఓవర్లలో దూబె వారిపై విరుచుకుపడతాడనే ఉద్దేశ్యంతోనే అతడిని ముందు పంపాం. దురదృష్టవశాత్తు మా ప్లాన్ వర్కౌట్ కాలేదు. ‘అని సూర్య అన్నాడు.
కొన్ని సార్లు ఇలా జరుగుతుందన్నాడు. ఔట్ ఫీల్డ్ స్లోగా ఉందని, వేగంగా ఉండి ఉంటే స్కోరు 180-185 అయి ఉండేదని తెలిపాడు. తాము 12 నుంచి 14 ఓవర్లు మెరుగ్గా వేస్తే విజయం సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయన్నాడు.
