Uae
T20 World Cup UAE : అందరూ ఊహించినట్లే జరిగింది. కోవిడ్ నేపథ్యంలో ఇండియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ను యూఏఈకి మార్చేశారు. ప్రస్తుతం భారత్లో ఉన్న పరిస్థితులను సమీక్షించారు. టోర్నీలో పాల్గొనే ప్లేయర్ల ఆరోగ్యం, రక్షణ కీలకంగా భావించారు. దీంతో టీ20 వరల్డ్కప్ను ఇండియాలో కాకుండా..యూఏఈ లో నిర్వహించాలని బీసీసీఐ కార్యదర్శి జే షా వెల్లడించారు. ఈ విషయాన్ని ICCకి 2021, జూన్ 28వ తేదీ సోమవారం సాయంత్రం వెల్లడిస్తామన్నారు. షెడ్యూల్ ను ఇంకా పూర్తిస్థాయిలో రూపొందించలేదని, త్వరలోనే వెల్లడిస్తామన్నారు.
అక్టోబర్ 17 నుంచి యూఏఈలో వరల్డ్కప్ను నిర్వహించే అవకాశాలు ఉన్నాయని, ఫైనల్ మ్యాచ్ను నవంబర్ 14వ తేదీన నిర్వహిస్తారని వార్తలు ఇప్పటికే వస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రజల జీవనవిధానాల్లో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. ఈ వైరస్ కారణంగా అవే మార్పులు క్రికెట్ వేదికలపై కూడా పడుతోంది. ముందస్తు నిర్ణయాల ప్రకారం ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్లో జరగాల్సి ఉంది. కానీ భారత్లో డెల్టా విజృంభణ కారణంగా ప్రపంచకప్ ఇక్కడ జరిగే అవకాశం దాదాపు లేనట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఇటీవల ఐపీఎల్ 14వ సీజన్ సైతం కరోనా కేసుల కారణంగానే వాయిదా పడింది. ఆ మెగా టోర్నీని కూడా యూఏఈలోనే నిర్వహించాలని బీసీసీఐ తగిన ప్రణాళికలు రూపొందిస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 మధ్య ఐపీఎల్ నిర్వహించాలని, దీని తర్వాత అక్కడే పొట్టి ప్రపంచకప్ను కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.