Virat Kohli: లండన్ విమానం ఎక్కనున్న కోహ్లి
మ్యాచ్ ఆడి కొన్ని గంటలు గడవక ముందే స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(Virat Kohli) లండన్ విమానం ఎక్కనున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఫైనల్ (WTC Final) మ్యాచ్ ఆడేందుకు విరాట్ వెళ్లనున్నాడు.
- Thota Vamshi Kumar
- Published On : May 22, 2023 / 07:54 PM IST
Virat Kohli
WTC Final: ఐపీఎల్(IPL) 2023 సీజన్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశ ముగియగా, ప్లే ఆఫ్స్ మ్యాచ్లు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు ప్లే ఆఫ్స్కు చేరకుండానే నిష్క్రమించింది. మ్యాచ్ ఆడి కొన్ని గంటలు గడవక ముందే స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి(Virat Kohli) లండన్ విమానం ఎక్కనున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఫైనల్ (WTC Final) మ్యాచ్ ఆడేందుకు విరాట్ వెళ్లనున్నాడు.
లండన్లోని ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియాతో భారత జట్టు తలపడనుంది. మ్యాచ్కు మరో రెండు వారాల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే టీమ్ఇండియా సన్నాహకాలను మొదలుపెట్టింది. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్కు చేరుకోని భారత జట్టులోని ఆటగాళ్లు రేపు(మంగళవారం) లండన్కు బయలుదేరి వెళ్లనున్నారు.
Virat Kohli: కోహ్లి మోకాలికి గాయం.. కీలక అప్డేట్ ఇచ్చిన ఆర్సీబీ హెడ్ కోచ్ బంగర్
వీరంతా హెడ్కోచ్ ద్రవిడ్ పర్యవేక్షణలో ప్రాక్టీస్ను చేయనున్నారు. విరాట్ కోహ్లితో పాటు అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, జయదేశ్ ఉనాద్కత్, నెట్ బౌలర్లు అనికేత్ చౌదరి, ఆకాశ్ దీప్, యర్ర పృథ్వీరాజ్ లు మొదటి విడుతలో ఇంగ్లాండ్కు బయలుదేరనున్నారు. వీరంతా మంగళవారం 4.30 గంటలకు లండన్ విమానం ఎక్కుతారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
వీరంతా అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు వీలుగా రెండు వారాల ముందుగానే పంపిస్తున్నట్లు చెప్పారు. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన ఆటగాళ్లలో కెప్టెన్ రోహిత్ శర్మ, అజింక్యా రహానే, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీలు ప్లే ఆఫ్స్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఆయా మ్యాచులు ముగిసిన వెంటనే వీరు లండన్కు బయలుదేరి వెళ్లనున్నారు.
నయా వాల్ అక్కడే
టీమ్ఇండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారా ఇంగ్లాండ్లోనే ఉన్నాడు. కౌంటీ ఛాంపియన్ షీప్ డివిజన్ 2లో ఆడేందుకు అతడు ఎప్పుడో ఇంగ్లాండ్ వెళ్లాడు. ససెక్స్ జట్టుకు అతడు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.
WTC ఫైనల్కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్)
స్టాండ్బై ఆటగాళ్లు: రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్.
