Virender Sehwag sensational comments on Virat Kohli Strike Rate vs RR Match
Virender Sehwag -Virat Kohli : ఐపీఎల్లో విరాట్ కోహ్లి పరుగుల వరద పారిస్తున్నాడు. శనివారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో శతకంతో చెలరేగాడు. 72 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 156.94 స్ట్రైక్రేటుతో 113 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో కోహ్లి 67 బంతుల్లో సెంచరీని అందుకున్నాడు. ఐపీఎల్లో అత్యంత నెమ్మదైన శతకాల్లో ఇది ఒకటి కావడంతో సోషల్ మీడియాలో కోహ్లి పై ట్రోలింగ్ మొదలైంది. ఈ నేపథ్యంలో కోహ్లి స్ట్రైక్రేటు పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడాడు.
‘నా అభిప్రాయ ప్రకారం రాజస్థాన్ పై బెంగళూరు ఓ 20 పరుగులు తక్కువగా చేసింది. విరాట్ కోహ్లి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే.. మిగిలిన ఆటగాళ్లు రాణించలేదు. డుప్లెసిస్, గ్లెన్మాక్స్వెల్, కామెరూన్ గ్రీన్లు దూకుడుగా ఆడడంలో విఫలం అయ్యారు. దినేశ్ కార్తీక్, మహిపాల్ లామ్రోర్లకు బ్యాటింగ్ రాలేదు. దీంతో కోహ్లి పై ఒత్తిడి పెరిగిపోయింది. ఫలితంగా స్ట్రైక్రేటు పడిపోయింది.’ అని సెహ్వాగ్ అన్నాడు.
కోహ్లి ఫామ్ గురించి ఎవ్వరికి ఎటువంటి సందేహాలు లేవన్నాడు. ఇన్నింగ్స్ ఆఖరి వరకు అతడు క్రీజులో ఉండాలని భావించాడన్నారు. ఎక్కువ మొత్తంలో అందుకుంటున్న ఆటగాళ్లు దారుణంగా విఫలం అవుతున్నారని చెప్పాడు. ముఖ్యంగా మాక్స్వెల్ పూర్తిగా నిరాశపరిచాడు అని సెహ్వాగ్ తెలిపాడు.
మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కోహ్లి(72 బంతుల్లో 113నాటౌట్) శతకం చేశాడు. 184 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 19.1ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆర్ఆర్ బ్యాటర్లో జోస్ బట్లర్ (58 బంతుల్లో 100నాటౌట్) శతక్కొట్టాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (42 బంతుల్లో 69) వేగంగా ఆడాడు.
Jos Buttler : ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్.. ఒక్క సెంచరీ ఎన్నో రికార్డులు..
ఈ సీజన్లో రాజస్థాన్కు ఇది వరుసగా నాలుగో విజయం. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ అగ్రస్థానానికి దూసుకువచ్చింది. అటు ఐదు మ్యాచులు ఆడిన ఆర్సీబీ నాలుగు మ్యాచుల్లో ఓడిపోయి పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.