Shreyas Iyer : మంచి ఊపులో ఉన్నాం.. సవాళ్లకు సిద్ధం.. తొలి సిరీస్ విజయం అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్..
టీమ్ఇండియా టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు.
Shreyas Iyer comments after Team India first series win his captaincy
Shreyas Iyer : టీమ్ఇండియా టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్ 35 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో జింబాబ్వేను 3-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో భారత్.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతుల్లో టీ20 సిరీస్లను ఓడిపోయిన సంగతి తెలిసిందే.
తొలి సిరీస్ను విజయాన్ని సాధించడం పట్ల శ్రేయస్ అయ్యర్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ.. ఈ జట్టులోని యువ ఆటగాళ్లు ఎంత నిర్భయంగా ఆడుతున్నారో అందరూ చూశారు. వారు మైదానంలో చూపిస్తున్న ఉత్సాహం, ఆత్మవిశ్వాసం అద్భుతంగా ఉంది. వరుస మ్యాచ్లు ఆడినా అదే ఎనర్జీని కొనసాగించడం నాకు కెప్టెన్గా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు కూడా వారు అద్భుతంగా ఆడారు. జింబాబ్వేలో 3-0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేయడం నాకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతి. అని అన్నాడు.
Sree Charani : తెలుగు క్రికెటర్ శ్రీ చరణి.. రెండు నెలలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. ఫోటోలు వైరల్..
కెప్టెన్ గా తనపై అనదపు బాధ్యత ఉందా? అనే ప్రశ్న ఎదురు కాగా.. గణంకాలను ఓ సారి చూస్తే నా మ్యాచ్ల సంఖ్య కూడా దాదాపు వాళ్లతో సమానంగానే ఉంది. నేను సుమారు 55 నుంచి 60 మ్యాచ్లు ఆడాను. ప్రస్తుతం ఐపీఎల్ వల్ల చాలా మంది యువ ఆటగాళ్లకూ అనుభవం వచ్చింది. వారు అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాళ్లు. వారిలోని అత్యుత్తమ ప్రతిభను వెలికి తీయడం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. నేను మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ వాళ్లు సౌకర్యంగా, ఒత్తిడి లేకుండా ఉండేలా చూసేందుకు ప్రయత్నిస్తాను. ఎందుకంటే వారు రిలాక్స్గా ఉన్నప్పుడే తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తారు అని అయ్యర్ తెలిపాడు.
సవాళ్లకు సిద్ధం..
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాల్లోనూ ఆటగాళ్లు రాణిస్తే కెప్టెన్గా మీ పని సులభం అవుతుంది కదా అని అడుగగా.. కెప్టెన్గా ఆటగాళ్లు బాధ్యత తీసుకుని మ్యాచ్లు గెలిపిస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. అదే భవిష్యత్తులో కూడా కొనసాగాలి. ప్రస్తుతం మేము మంచి ఊపులో ఉన్నాం. ఇకపై కూడా ఇదే విధమైన దృక్పథం, వైఖరిని కొనసాగిస్తూ నిలకడగా ఆడటం ముఖ్యం. ముందున్న సవాళ్లు కఠినంగానే ఉంటాయి. కానీ మా ప్రశాంతత, ధైర్యం ఇలాగే కొనసాగితే భారత క్రికెట్కు ఎంతో మేలు జరుగుతుంది.
ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా, ప్రతి మ్యాచ్లో గతం కంటే మరింత మెరుగ్గా ఆడాలని మా లక్ష్యం. ప్రతి సారి మైదానంలోకి వెళ్లినప్పుడు ఒక మెట్టు పైకి ఎదగాలనే ఆలోచనతో ఆడాలని ఆటగాళ్లందరికీ మేము సందేశం ఇచ్చాం. పరిస్థితులు ఎలా ఉన్నా, మన సామర్థ్యానికి తగ్గ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం, జట్టును విజయపథంలో నడిపించడం అత్యంత ముఖ్యమని వారికి ఎప్పుడూ చెబుతూనే ఉన్నాం. అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు.
