Rohit Sharma
Rohit : సెంచూరియన్ వేదికగా దక్షిణాప్రికాతో జరిగిన మొదటి టెస్టు మ్యాచులో భారత జట్టు ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచులో మొదటి ఇన్నింగ్స్లో కేఎల్ రాహుల్ (101), రెండో ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ (76) మినహా మిగిలిన వారు ఎవ్వరూ కూడా రాణించలేదు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్లో ఐదు పరుగులు చేసిన హిట్ మ్యాన్ రెండో ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో భారత బ్యాటర్లపై విమర్శలు ఎక్కువ అయ్యాయి. పేస్, బౌన్స్ ఎలా ఎదుర్కొవాలో అనే విషయాలను తెలియవని పలువురు మండిపడ్డారు.
ఈ క్రమంలో భారత జట్టు పై వస్తున్న విమర్శలపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. విదేశాల్లో ఎలా ఆడాలనే విషయాలు తమ జట్టుకు తెలుసన్నాడు. గతంలో తాము ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లో సాధించిన విజయాలను ఓ సారి గుర్తు చేసుకోవాలని అన్నాడు. ‘దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టులో మా ప్రదర్శన బాగాలేదు. అదే సమయంలో మేము ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ఎలా ఆడామో అన్న విషయాలను మరిచిపోకూడడు. అక్కడ మేము సిరీస్లు గెలిచాము, డ్రా చేసుకున్నాము. బ్యాటర్లు కూడా పరుగుల వరద పారించారు.’ అని రోహిత్ శర్మ అన్నాడు.
సెంచూరియన్ మ్యాచులో దక్షిణాఫ్రికా జట్టు చాలా మెరుగ్గా ఆడిందని, అందువల్లే ఓటమి ఎదురైందని హిట్మ్యాన్ చెప్పుకొచ్చాడు. కొన్ని సార్లు ఇలాంటి ఫలితాలు ఎదురు అవుతాయన్నాడు. విదేశాల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో తెలియక కాదన్నాడు. ప్రత్యర్థి 110 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. అయితే.. మేం రెండు ఇన్నింగ్స్ల్లోనూ రాణించలేకపోయాము. దీనిపై వ్యాఖ్యలు చేసే ముందు మేం పర్యటించిన గత నాలుగు విదేశీ పర్యటనలను పరిశీలించాలని, అందులో బ్యాటింగ్, బౌలింగ్ రికార్డులను ఓ సారి చూడాలని రోహిత్ శర్మ తెలిపాడు.
కాగా.. దక్షిణాఫ్రికాలో తొలిసారి టెస్టు సిరీస్ గెలవాలన్న భారత్ కల మూడు రోజుల్లోనే ముగిసింది. డీన్ ఎల్గర్ తన సొంత మైదానంలో తన చివరి టెస్ట్లో 185 పరుగులు చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్లో 405 పరుగులు చేసింది. భారత్ రెండు ఇన్నింగ్స్ల్లో 245, 131 మాత్రమే చేసింది. ఇరు జట్ల మధ్య కేప్టౌన్ వేదికగా జనవరి మూడు నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.