హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25న శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. అయితే.. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బ్లాక్ టికెట్ల దందాకు పాల్పడుతుందని ఆరోపిస్తూ ఈ మ్యాచ్ను అడ్డుకుంటామని విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు.
ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు ఉన్నాయని ఆరోపిస్తూ శనివారం ఉదయం ఏఐవైఎఫ్, డీఐవైఎఫ్, పివైఎల్ సంఘాలు ఉప్పల్ స్టేడియం వద్ద నిరసనకు దిగాయి. లోపలికి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో సెక్యూరిటీ సిబ్బందికి, విద్యార్థి సంఘం నాయకులకు మధ్య తోపులాట చేసుకుంది. స్టేడియం మెయిన్ గేటు వద్ద బైఠాయించారు ఏఐవైఎఫ్, డీఐవైఎఫ్, పివైఎల్ నాయకులు.
IPL 2024 : డీఆర్ఎస్ వివాదం.. ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ
ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రెటరీ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్ల విషయంలో బ్లాక్ దందాకు పాల్పడుతున్నట్లుగా ఆరోపించారు. 30 నిమిషాల్లో 36వేల టికెట్లు ఏ విధంగా అమ్ముడుపోయాయని ప్రశ్నించారు. క్రికెట్ అభిమానులు టికెట్లు దొరకక నానా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇందుకు నిరసనగా.. ఏప్రిల్ 25న జరిగే ఉప్పల్లో జరిగే ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ను అడ్డుకుంటామని హెచ్చరించారు.