తడబడిన భారత టాపార్డర్ 203/6

వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టాస్ ఓడిన భారత్‌కు గట్టి సవాలే ఎదురైంది. ఓపెనర్ మినహాయించి టాపార్డర్ కుప్పకూలిన వేళ రహానె జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. విండీస్‌ ఫాస్ట్‌బౌలర్లు రోచ్‌, గాబ్రియెల్‌ ధాటికి 25 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్(44)మాత్రమే శుభారంభాన్ని అందించాడు. 

అతనితో పాటు బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్(5), ఆ తర్వాత వచ్చిన చతేశ్వర్ పూజారా(2), విరాట్ కోహ్లీ(9)వరుస వైఫల్యాలతో భారత్ తక్కువ స్కోరుతో ఇన్నింగ్స్ ముగిస్తుందని భావించారంతా. ఈ దశలో క్రీజులో నిలబడిన రహానె(81) చక్కటి స్కోరు అందించాడు. హనుమ విహారీ(32)తో కలిసి ఇన్నింగ్న్‌ను చక్కబెట్టాడు. 54.5 ఓవర్ల వద్ద విహారీ, 59.4 ఓవర్ల వద్ద రహానె వెనుదిరిగారు. 

తొలిరోజు ఆటముగిసే సమయానికి రిషబ్ పంత్(20 నాటౌట్), రవీంద్ర జడేజా(3)లు క్రీజులో ఉన్నారు. విండీస్ బౌలర్లు కీమర్ రోచ్ చేతిలో మయాంక్, పూజారా, హనుమ విహారీ ముగ్గురు వికెట్లు కోల్పోగా, షానోన్ గాబ్రియెల్‌కు కోహ్లీ, రహానె చిక్కారు. రోస్టన్ చేజ్ కేఎల్ రాహుల్ వికెట్ పడగొట్టాడు.  

ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్‌.. వెస్టిండీస్‌లు ఆడుతోన్న తొలి టెస్టు మ్యాచ్ ఇదే.