ఇంగ్లాండ్లో పాకిస్తాన్ యువ ఆటగాడు హైదర్ అలీని అరెస్టు చేశారు. పాకిస్తాన్-ఏ తరఫున బెకెన్హెయిమ్లో ఇంగ్లాండ్-ఏ జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్లో అలీ ఆడుతున్నాడు. అత్యాచారం కేసులో అతడిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంటనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హైదర్ అలీని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దర్యాప్తు పూర్తి అయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ప్రకటించింది.
అందుతున్న సమాచారం మేరకు 2025 జూలై 23న తన పై 24 ఏళ్ల హైదర్ అలీ అత్యాచారానికి పాల్పడ్డాడు అని ఓ యువతి గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆగస్టు 3వ తేదీన హైదర్ అలీని అరెస్టు చేశారు. ఆ తరువాత అతడు బెయిల్ పై విడుదల అయినట్లు తెలుస్తోంది. కాగా.. హైదర్కు చట్టపరమైన మద్దతు అందిస్తామని పీసీబీ తెలిపింది.
అంతర్జాతీయ క్రికెటె్లో 2020లో అరంగ్రేటం చేశాడు హైదర్ అలీ. ఇప్పటి వరకు పాక్ తరుపున 2 వన్డేలు, 35 టీ20లు ఆడాడు. వన్డేల్లో 21 సగటుతో 42 పరుగులు చేయగా, టీ20ల్లో 17.4 సగటుతో 505 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 27 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ల్లో 1,797 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు అతడు ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు.
హైదర్ చివరిసారిగా 2023 అక్టోబర్ 6న హాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ తరపున ఆడాడు.