Sidra Amin : భారత్ పై 81 పరుగులు.. పాక్ ప్లేయర్ సిద్రా అమిన్కు ఐసీసీ భారీ షాక్.. మందలించడంతో పాటు..
పాక్ స్టార్ ప్లేయర్ సిద్రా అమిన్ (Sidra Amin )కు ఐసీసీ షాక్ ఇచ్చింది.
- Thota Vamshi Kumar
- Published On : October 7, 2025 / 11:26 AM IST
Womens World Cup 2025 Sidra Amin Handed Big Punishment By ICC
Sidra Amin : మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 5న) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులు సాధించింది. భారత బ్యాటర్లలో హర్లీన్ డియోల్ (46), రిచా ఘోష్ (35 నాటౌట్), జెమీమా రోడిక్స్ (32), ప్రతీక రావల్ (31) లు రాణించారు. పాక్ బౌలర్లలో డయానా బేగ్ నాలుగు వికెట్లు పడగొట్టింది. ఫాతిమా సనా, సాదియా ఇక్బాల్ లు చెరో రెండు వికెట్లు తీశారు.
ఆ తరువాత 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 43 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో సిద్రా అమిన్ (81; 106 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మలు చెరో మూడు వికెట్లు తీయగా.. స్నేహ్ రాణా రెండు వికెట్లు సాధించింది.
కాగా.. ఈ మ్యాచ్లో ఒంటరి పోరాటం చేసిన పాక్ ప్లేయర్ సిద్రా అమిన్కు ఐసీసీ భారీ షాక్ ఇచ్చింది. మందలించడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ను ఆమె కాతాలో చేర్చింది.
అసలేం జరిగిందంటే..?
భారత్ మ్యాచ్లో మిగిలిన బ్యాటర్లు విఫలమైనా.. సిద్రా అమిన్ (Sidra Amin) ఒంటరి పోరాటం చేసింది. పాక్ ఇన్నింగ్స్ 40వ ఓవర్ను స్నేహ్ రాణా వేసింది. ఈ ఓవర్లోని ఐదో బంతిని సిద్రా షాట్ ఆడగా హర్మన్ ప్రీత్ క్యాచ్ అందుకోవడంతో ఔటైంది. అప్పటికే పాక్ ఓటమి ఖాయం కావడం, తన సెంచరీ చేసే అవకాశం మిస్ కావడంతో సిద్రా తీవ్ర అసహనంతో తన బ్యాట్ను గట్టిగా నేలకేసి కొట్టింది.
ఇది ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘన కిందకు వస్తుంది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ సిద్రాను మందలించడంతో పాటు ఆమె ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ను చేర్చింది.
‘ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్లో ప్లేయర్లు.. క్రికెట్ పరికరాలు, దుస్తులు లేదంటే గ్రౌండ్ ఎక్విప్మెంట్, ఫిట్టింగ్స్ వంటి వాటికి నష్టం కలిగించేలా వ్యవహరించడం నేరం. సిద్రా ఈ నిబంధనను ఉల్లంఘించింది. అందుకనే ఆమెను మందలించడంతో పాటు ఆమె ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ను చేర్చాం. ‘అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక చేసిన తప్పును, విధించిన శిక్షను సిద్రా అమిన్ అంగీకరించిందని, దీంతో దీనిపై తదుపరి ఎలాంటి విచారణ ఉండదని తెలిపింది.
