తిరువనంతపురంలో జరిగిన రెండో టీ20 మ్యాచులో టీమ్ఇండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు ఓపెనర్ యశస్వి జైస్వాల్. అయితే.. తాను ఓ తప్పు చేశానని, అందుకు క్షమాపణలు కూడా చెప్పినట్లు మ్యాచ్ అనంతరం యశస్వి స్వయంగా వెల్లడించాడు. ఇంతకీ అతడు చేసిన తప్పు ఏంటో తెలుసా..?
వాస్తవానికి రెండో టీ20 మ్యాచ్లో యశస్వి ఎలాంటి తప్పు చేయలేదు కానీ.. వైజాగ్ వేదికగా జరిగిన మొదటి టీ20లో యశస్వి కారణంగా రుతురాజ్ గైక్వాడ్ రనౌట్ అయిన సంగతి తెలిసిందే. కాగా..రెండో టీ20ల్లో మెరుపు అర్ధశతకం బాదడంతో యశస్వి జైస్వాల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ అవార్డు అందుకున్న తరువాత యశస్వి మాట్లాడుతూ.. మొదటి మ్యాచ్లో రుతురాజ్ రనౌట్ గురించి ప్రస్తావించాడు.
ఆ రనౌట్ తన తప్పేనని ఒప్పుకున్నాడు. ఇందుకు రుతురాజ్ను క్షమాపణలు కూడా అడిగినట్లు చెప్పాడు. రుతురాజ్ మంచి వ్యక్తి అని జాగ్రత్తగా ఉంటాడని యశస్వి చెప్పుకొచ్చాడు. ఇక రెండో టీ20 మ్యాచులో తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. గ్రౌండ్లో స్వేచ్ఛగా ఆడమని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు కోచ్ లక్ష్మణ్ చెప్పారని దీంతో తానెంటో చూపించాలని అనుకున్నట్లు తెలిపాడు.
Yashasvi Jaiswal : చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్.. ఒకే ఒక్కడు
నా ఆటను మెరుగుపరచుకోవాలని అనుకుంటున్నా. ఇంతకు మించి మరేది ఆలోచించను. నేను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాను. అన్ని రకాల షాట్లను పదును పట్టుకోవాలని భావిస్తున్నాను. ఆ దిశగానే పని చేస్తున్నాను. అని యశస్వి జైస్వాల్ అన్నాడు. ఈ మ్యాచ్లో షాట్ల ఎంపిక విషయంలో చాలా స్పష్టంగా ఉన్నట్లు చెప్పాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (53; 25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (58; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (52; 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) లు అర్ధశతకాలు చేశారు. ఆఖర్లో రింకూ సింగ్ (31 నాటౌట్; 9 బంతుల్లో 4 పోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు.
Bowler Bizarre Action : విచిత్రమైన బౌలింగ్ యాక్షన్.. అయోమయంలో బ్యాటర్.. ఎక్కడ ఉన్నావ్ బాసూ..!
లక్ష్య ఛేదనలో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 191 పరుగులకు పరిమితమైంది. మార్కస్ స్టోయినిస్ (45), మాథ్యూవేడ్ (42 నాటౌట్), టిమ్ డేవిడ్ (37) లు రాణించగా మిగిలిన వారు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో రవిబిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్ తలా వికెట్ సాధించారు.