×
Ad

Telangana Assembly Election 2023 : తెలంగాణలో అతి తక్కువ ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలివే…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో పలు ప్రత్యేకతలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో తక్కువ జనాభా కారణంగా 15 పోలింగ్ కేంద్రాల్లో 100 మంది కంటే తక్కువ మంది ఓటర్లు ఉన్నారు....

  • Published On : November 27, 2023 / 11:30 AM IST

Telangana polling stations

Telangana Assembly Election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వంలో పలు ప్రత్యేకతలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో తక్కువ జనాభా కారణంగా 15 పోలింగ్ కేంద్రాల్లో 100 మంది కంటే తక్కువ మంది ఓటర్లు ఉన్నారు. 15 పోలింగ్ బూత్‌లలో 100 కంటే తక్కువ మంది ఓటర్లు నమోదైనందున ఓటర్లు ఎక్కువ సేపు క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా సులభంగా ఓటు వేయవచ్చునని ఎన్నికల అధికారులు చెప్పారు.

ALSO READ : Telangana Assembly Election 2023 : ఎస్సీ,ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో దళిత, ఆదివాసీ ఓటర్లే కీలకం

మరో 109 పోలింగ్ కేంద్రాల్లో 101 నుంచి 200 మంది ఓటర్లే ఉన్నారు. 292 పోలింగ్ బూత్ లలో 201 నుంచి 300మంది ఓటర్లు నమోదు చేసుకున్నారు. 292 పోలింగ్ స్టేషన్లలో 301 నుంచి 400 వరకు ఓటర్లున్నారని జిల్లా ఎన్నికల అధికారులు చెప్పారు. 1,113 పోలింగ్ కేంద్రాల్లో 500 మంది కంటే అధిక ఓటర్లు ఉన్నారని ఎన్నికల అధికారులు వివరించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని గుడి లింగాపూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటైన పోలింగ్ కేంద్రంలో అత్యల్ప సంఖ్యలో ఓటర్లను గుర్తించినట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల కార్యాలయం అధికారులు వెల్లడించారు.

ALSO READ : Telangana Assembly Election 2023 : తెలంగాణ చివరి అంకంలో అగ్రనేతల ప్రచార హోరు

గుడిలింగాపూర్ కేంద్రంలో కేవలం 56 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. కొన్ని గ్రామాల్లో జనాభా తక్కువగా ఉన్నందు వల్లే ఆయా పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓటర్ల సంఖ్య తక్కువగా ఉందని ఓ ఎన్నికల అధికారి చెప్పారు. ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలోని రామవరం పోలింగ్ కేంద్రంలో 63 మంది ఓటర్లే ఉన్నారు. భువనగిరిలోని గంగాపురం పోలింగ్ బూత్ లో 68 మంది, సిర్పూర్ సెగ్మెంటులోని బోరేగాం కేంద్రంలో 73 మంది ఓటర్లు ఉన్నారు.

ALSO READ : Telangana Assembly Election 2023 : మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కేంద్ర బలగాల మోహరింపు…డ్రోన్లతో నిఘా

ఆదిలాబాద్ నియోజకవర్గంలోని డోలారా కేంద్రంలో 77 మంది, సిర్ఫూర్ లోని మంకాపాటారులో 79 మంది, ముథోల్ లోని పూస్పూర్ బూత్ లో 88 మంది, బోధ్ లోని పెద్ద గోండ్ గూడలో 94 మంది, మానకొండూర్ ప్రాథమిక పాఠశాల పొలింగ్ కేంద్రంలో 96 మంది, బృందావనపురంలో 96 మంది, పినపాక సెగ్మెంటులోని మండల పరిషత్ లో 99 మంది, ములుగులోని బక్కచింతలపాడు బూత్ లో 100 మంది ఓటర్లు ఉన్నారు.

తెలంగాణలో 3.26 కోట్ల ఓటర్లు

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3.26 కోట్లమంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. 1,62,98,418 మంది పురుష ఓటర్లు ఉన్నారు. 1,63,01,705 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. తెలంగాణ మొత్తంమీద 2,676 మంది ట్రాన్స్ జండర్ ఓటర్లు ఉన్నారు. తెలంగాణలో 1,68, 612 మంది ఉద్యోగులు పోలింగ్ విధులకు హాజరుకానున్నందున వారికి పోస్టల్ బ్యాలెట్లు జారీచేశారు. 26,660 మంది సీనియర్ సిటిజన్లు, దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా 709 కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు.