Grama Sabalu: తెలంగాణలో తొలిరోజు గ్రామసభల్లో కొత్తగా 47,413 దరఖాస్తులు
పథకాలకు అర్హుల లిస్టును గ్రామసభల్లో ప్రజలకు అధికారులు చదివి వినిపించారు.
- T Venkateshwarlu
- Published On : January 22, 2025 / 08:04 AM IST
Grama Sabalu in TG
తెలంగాణ సర్కారు చేపట్టిన గ్రామ, వార్డు సభల్లో తొలి రోజు (మంగళవారం) కొత్తగా 47,413 దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఈ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సభలు నెల 24 వరకు జరగనున్నాయి. గ్రామ సభల్లో ప్రజలు తమ సమస్యలపై అధికారులకు చెప్పుకొచ్చారు. పలు ప్రాంతాల్లో లబ్ధిదారుల లిస్టులో తమ పేర్లు లేకపోవడంపై ప్రజలు అధికారులను నిలదీశారు.
తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో మంగళవారం 3,410 పంచాయతీల పరిధిలో సభలను నిర్వహించారు. జాబితాలో పేర్లు రానివారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు.
ఇలా కొత్తగా 47,413 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో కొత్త రేషన్కార్డుల కోసం అధికారులను ప్రజలు నిలదీశారు. దరఖాస్తులు తీసుకువెళ్తున్నారు కానీ, రేషన్ కార్డులను జారీ చేయడం లేదని, గతంలోనూ దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేకుండాపోతోందని అన్నారు.
కొన్ని ప్రాంతాల్లో అనర్హులతో లబ్ధిదారుల లిస్టును రూపొందించారని ప్రజలు ఆందోళన తెలిపారు. పథకాలకు అర్హుల లిస్టును గ్రామసభల్లో ప్రజలకు అధికారులు చదివి వినిపించారు. గ్రామసభల్లో వచ్చే దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని అధికారులు అన్నారు.
Target GHMC Mayor : జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో బీఆర్ఎస్..
