సినీనటి ఫిర్యాదుతో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు..
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. తనను కించపరుస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ
- Harishth Thanniru
- Published On : February 15, 2025 / 10:08 AM IST
JC Prabhakar Reddy
JC Prabhakar Reddy: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. తనను కించపరుస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని, ఆయన అనుచరులు తనను బెదిరిస్తున్నారని సినీనటి, బీజేపీ నేత మాధవీ లత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవల ఓ ఈవెంట్ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, మాధవీ లత మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరులు తనను బెదిరింపు కాల్స్ తో పాటు సోషల్ మీడియాలో టార్గెట్ చేశారని, తనను కించపరుస్తూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడని మాధవిలత ఫిర్యాదులో పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో కోరారు.
వివాదం ఏమిటంటే..?
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తాడిపత్రిలో ఉండే మహిళల కోసం అంటూ తాడిపత్రిలోని జేసీ పార్కులో జేసీ ప్రభాకర్ రెడ్డి డిసెంబర్ 31న రాత్రి స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ ను మాధవీ లత తప్పుబట్టారు. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దని మహిళలకు సూచిస్తూ ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. దీంతో మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో మాదవీ లతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పలువురు బీజేపీ నేతలు జేసీ వ్యాఖ్యలపై మండిపడ్డారు. జేసీపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని మాధవీలత డిమాండ్ చేశారు. అయితే, ప్రభాకర్ రెడ్డి మాధవీ లతపై చేసిన వ్యాఖ్యల పట్ల విమర్శలు రావడంతో ఆయన వెనక్కితగ్గి ఆమెకు క్షమాపణలు చెప్పారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి తనను కించపర్చేలా మాట్లాడాడంటూ మాధవీ లత కన్నీరు పెట్టుకుంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడినందుకు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయింది. అయితే, కొద్దిరోజుల తరువాత మాధవీలత జేసీ ప్రభాకర్ రెడ్డిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో, హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. తాజాగా సైబరాబాద్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనను కించపరుస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని సినీనటి మాధవీ లత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
