Secunderabad Agnipath Protests : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇంకా రణరంగాన్ని తలపిస్తోంది. ఒకవైపు నిరసనకారులు, మరోవైపు పోలీసులు మోహరించారు. న్యాయం జరిగేవరకు తగ్గేది లేదని నిరసనకారులు తేల్చి చెప్పారు. వారి ఆందోళనలు విరమింపజేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. చర్చలకు రావాలని అధికారులు ఆహ్వానించారు. అయితే, చర్చలకు ఆందోళనకారులు నిరాకరించారు. అధికారుల విజ్ఞప్తిని తిరస్కరించారు.
10మందితో రైల్వే రిక్రూట్ మెంట్ ఆఫీసుకి చర్చలకు రావాలని అధికారులు కోరారు. అయితే, అందుకు ఆందోళనకారులు ఒప్పుకోలేదు. పదిమంది కాదు.. చర్చలకు అందరం వస్తామంటున్నారు. అంతేకాదు.. రైల్వే స్టేషన్ లోనే చర్చలు జరపాలని ఆందోళనకారులు పట్టుబట్టారు. ఏఆర్ఓ ఆఫీసులో చర్చలు జరిగితే న్యాయం జరగదని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్ష ఎప్పుడు పెడతారో స్పష్టమైన హామీ కావాలని నిరసనకారులు అంటున్నారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
కాగా, పరీక్షపై స్పష్టత ఇవ్వకపోతే ఎంతకమైనా తెగిస్తామని ఆందోళనకారులు అంటున్నారు. ఇంకా నిరసనకారులు రైల్వే ట్రాక్ పైనే ఉన్నారు. అయితే, విధ్వంసానికి దిగితే ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరించారు. రైల్వే స్టేషన్ లోనే ఉన్న ఆందోళనకారులు తాము చర్చలకు వెళ్లబోమని చెబుతున్నారు. ఆర్మీ ఉద్యోగ నియామక అధికారి తమ వద్దకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.
త్రివిధ దళాల్లో సైనిక నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ స్కీమ్ ప్రకటించింది. అయితే, ఈ స్కీమ్ అగ్నిగుండాన్ని రాజేసింది. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా ఏడు రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
తాజాగా తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఆందోళనలు పాకాయి. పెద్దఎత్తున తరలివచ్చిన ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడ్డారు. రైళ్లకు నిప్పుపెట్టారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జి చేశారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవటంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో వరంగల్ కు చెందిన ఓ యువకుడు మృతిచెందగా, 15 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనతో సికింద్రాబాద్ తో సహా పలు రైల్వే స్టేషన్లు మూసివేశారు. హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలను నిలిపివేశారు.
అగ్నిపథ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం నుంచి సికింద్రాబాద్ స్టేషన్ తీవ్రస్థాయి ఉద్రిక్తతలకు నిలయంగా మారింది. హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు కాల్పులు జరపగా, ఓ నిరసనకారుడు మృతి చెందాడు.
Agnipath : అప్పుడు అన్నదాతలతో.. ఇప్పుడు దేశ జవాన్లతో కేంద్రం ఆడుకుంటోంది : కేటీఆర్
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఉదయంతో పోల్చితే నిరసనకారుల సంఖ్య కాస్త తగ్గినా, ఇప్పటికీ అక్కడ ఆందోళనకర పరిస్థితి కొనసాగుతోంది.
ఆందోళనల నేపథ్యంలో రైలు ప్రయాణికుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు రైల్వే అధికారులను 040-27786666 నెంబర్ ద్వారా సంప్రదించాలని రైల్వే శాఖ పేర్కొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు రైల్వే శాఖ చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి (సీపీఆర్వో) వెల్లడించారు. ఆందోళనకారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వివరించారు. స్టేషన్ లో ఆర్పీఎఫ్, జీఆర్పీ, రాష్ట్ర పోలీసు బలగాలను మోహరించినట్టు తెలిపారు. రైల్వే ఆస్తులు ధ్వంసం చేసినవారిపై చర్యలు తీసుకుంటామని సీపీఆర్వో స్పష్టం చేశారు.