MP Komatireddy Venkat Reddy : ప్రధాని మోదీని కలిసిన ఎంపీ కోమటిరెడ్డి, భువనగిరికి బ్లాక్ లెవెల్ క్లస్టర్ మంజూరు చేయాలని విజ్ఞప్తి
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారు. ఆయన ఓ వినతి పత్రం ప్రధానికి అందించారు. భువనగిరికి బ్లాక్ లెవెల్ క్లస్టర్ మంజూరు చేయాలని అందులో కోరారు.
- Naveen
- Published On : March 23, 2023 / 04:43 PM IST
MP Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారు. ఆయన ఓ వినతి పత్రం ప్రధానికి అందించారు. భువనగిరికి బ్లాక్ లెవెల్ క్లస్టర్ మంజూరు చేయాలని అందులో కోరారు. మోదీ నాయకత్వంలోనీ ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని కోమటిరెడ్డి ప్రశంసించారు. జాతీయ రహదారులు, ట్రైన్ నెట్వర్క్, విమానాశ్రయాలు, టెక్స్ టైల్ పార్క్స్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్, మెట్రో రైల్ కనెక్టివిటీ సహా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కితాబిచ్చారు.
హైదరాబాద్ మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకూ కు విస్తరించాలని ఆయన ప్రధానిని కోరారు. మెట్రో విస్తరణపై ప్రతిపాదనలు పంపేలా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరేందుకు ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్ టు ప్రాజెక్టును ఘట్ కేసర్ నుంచి జనగాం వరకు పొడిగించాలని కోరారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు వరుసల రహదారిగా విస్తరణకు చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు పార్లమెంట్ లో ప్రస్తావించడంతో పాటు కేంద్ర రవాణ శాఖ మంత్రిని సైతం పలుమార్లు కలిసి విన్నవించడం జరిగిందని ఎంపీ కోమటిరెడ్డి చెప్పారు. భువనగిరి లోక్ సభ నియోజకవర్గంలో చేనేత కార్మికుల పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి కోసం నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద బ్లాక్ లెవెల్ క్లస్టర్ మంజూరు చేయాలని ప్రధానిని కోరారు.
నూతన టెక్నాలజీతో కూడిన అసో మిషన్స్ కూడా భువనగిరి నియోజకవర్గంలోని చేనేత కార్మికుల కోసం మంజూరు చేయాలన్నారు. 18ఏళ్ల నుండి 70ఏళ్ల వరకు ఉన్న చేనేత కార్మిక కుటుంబాలను ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాల పరిధిలోకి తీసుకురావాలని.. ప్రధానికి ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో కోరారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
