Munugode Bypoll: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మునుగోడు ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. మరో ఏడాది కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో గులాబీ జెండాను ఎగురవేసేందుకు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తుంది. రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు మునుగోడు నియోజకవర్గంలోనే మకాం వేశారు.
మునుగోడు ఉప ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే పార్టీలు తమతమ అభ్యర్థులను ప్రకటించాయి. నేడు టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. 14న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉప ఎన్నికకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. టీఆర్ఎస్ పేరుతోనే ఈ ఎన్నికకు వెళ్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక చర్చనీయాంశంగా మారింది. దీంతో సీఎం కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మంగా తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలకు గ్రామాలు, మండలాల వారిగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి ప్రచార పర్వంలోకి దింపారు. దీంతో మునుగోడులో టీఆర్ఎస్ ప్రచార పర్వం జోరుగా సాగుతోంది.
CM KCR Munugode Campaign : మునుగోడు ఉపఎన్నికలు.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం, స్వయంగా బరిలోకి
సీఎం కేసీఆర్సైతం మునుగోడు ఉపఎన్నికలో ప్రచారం చేయనున్నట్లు తెలిసింది. ఈ నెల 30న చండూరు మండలం బంగారిగడ్డ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అంతేకాక వీలునుబట్టి 30న బహిరంగ సభకంటే ముందు మరోబహిరంగ సభను నిర్వహించే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. దీనికితోడు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు చౌటుప్పల్, చండూరు మున్సిపాలిటీతో పాటు మునుగోడులో రోడ్ షోలలో పాల్గొంటారని తెలిసింది. మునుగోడు ఉపపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్.. గులాబీ జెండాను ఎగురవేసేందుకు అన్నివిధాల ప్రయత్నిస్తుంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.