Tammineni Veerabhadram
Telangana Election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులుతీరి ఓటుహక్కు వినియోగించుకున్నారు. సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాత్రం ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారు. తమ్మినేని వీరభద్రం పాలేరు నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కందాళ ఉపేంద్ర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మూడు పార్టీల నుంచి బలమైన నేతలు బరిలో నిలవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పాలేరు నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే, తమ్మినేని ఓటు వేయకపోవటం చర్చనీయాంశంగా మారింది.
తమ్మినేని వీరభద్రం తన స్వగ్రామం తెల్దారుపల్లిలో ఓటుహక్కు వినియోగించుకొనేందుకు పోలింగ్ బూత్ కు వెళ్లారు. ఓటర్ ఐడీ ఉన్నప్పటికీ లిస్టులో పేరు లేకపోవటంతో ఓటుకు ఎన్నికల అధికారులు తమ్మినేనిని అనుమతించలేదు. దీంతో తమ్మినేని తనఓటు తాను వేసుకోలేక పోయారు. తమ్మినేని ఓటు మిస్సింగ్ కావడం ఖమ్మం జిల్లాలోనేకాక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన ఓటు మిస్సింగ్ పై తమ్మినేని ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. తాను ఓటు వేసిన తరువాతనే పాలేరులో కౌంటింగ్ ప్రారంభించాలంటూ తమ్మినేని వీభద్రం కోరుతున్నారు.
హైదరాబాద్ లోఉన్న ఓటును ఫామ్ -8 ద్వారా తమ్మినేని తెల్దారుపల్లికి మార్చుకున్నారు. తెల్దారుపల్లికి ఓటు మారుస్తూ ఓటరు ఐడీని ఎన్నికల అధికారులు జారీ చేశారు. ఓటరు లిస్టులో పేరు లేకపోవడంతో తమ్మినేని ఓటును కోల్పోయాడు. అతని కుటుంబ సభ్యులుసైతం ఓటు హక్కును కోల్పోయారు.