IT Raids: మంత్రి పొంగులేటి నివాసాలపై ఈడీ దాడులు.. ఏకకాలంలో 16 చోట్ల..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏకకాలంలో పొంగులేటి ఇళ్లు, ఆఫీసుల్లో 16చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
- Harishth Thanniru
- Published On : September 27, 2024 / 10:13 AM IST
Ponguleti Srinivas Reddy
Minister Ponguleti Srinivas Reddy: హైదరాబాద్ లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలపై ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన 16 ఈడీ బృందాలు ఏకకాలంలో పొంగులేటి నివాసాలు, కార్యాలయాలు మొత్తం 15 చోట్ల సోదాలు చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారు జామునుంచే సీఆర్పీఎఫ్ పోలీసుల భద్రత నడుమ ఈడీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈడీ సోదాలపై మంత్రి పొంగులేటి, ఆయన అనుచరులు ఇంకా స్పందించలేదు. అయితే, సోదాల సమయంలో మంత్రి ఇంట్లోనే ఉన్నారా? వేరే ప్రాంతాల్లో ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది. సోదాలు పూర్తయిన తరువాత ఈడీ అధికారులు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రభుత్వంలో కీలక శాఖల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ బృందాలు ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు కొనసాగించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలాఉంటే.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.
గతేడాది నవంబర్ 3న ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాలతోపాటు హైదరాబాద్ లోని నందగిరి హిల్స్ లో ఉన్న ఇంట్లో కూడా ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. అదేవిధంగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో రాఘవా ఫ్రైడ్ లోనూ అధికారులు దాడులు చేశారు.
