Indiramma Indlu Scheme : హైదరాబాద్లోని పేద ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇండ్లు పక్కా.. హెల్ప్లైన్ ప్రారంభం
Indiramma Indlu Scheme : హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలో పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు పైలెట్ ప్రాజెక్టుగా 16 నియోజకవర్గాల పరిధిలో 7,680 ఇందిరమ్మ ఇండ్లు - టవర్స్ ను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
- Harish Thanniru
- Published on- July 26, 2026 / 08:51 AM IST
Indiramma Indlu Scheme
- హైదరాబాద్ లోని పేద ప్రజలకు శుభవార్త
- ఇందిరమ్మ టవర్స్ పై సందేహాల నివృత్తి కోసం హెల్ప్ లైన్ ప్రారంభం
- ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Indiramma Indlu Scheme : రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేదవారికి సొంతింటి కల నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివిధాల చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ప్రభుత్వం.. తాజాగా.. పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలోని పేద వర్గాల ప్రజలకు భారీ శుభవార్త చెప్పింది.
హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలో పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు పైలెట్ ప్రాజెక్టుగా 16 నియోజకవర్గాల పరిధిలో 7,680 ఇందిరమ్మ ఇండ్లు – టవర్స్ ను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, ఈ పథకంపై చాలామందిలో గందరగోళం ఉందని, కొన్ని అపోహలు ఉన్నాయని తమ దృష్టికి వచ్చిందని, అయితే, ఈ పథకంలో ప్రజల్లో ఎలాంటి గందరగోళం లేకుండా ఉండేందుకు హెల్ లైన్ ను ప్రారంభిచండం జరిగిందని తెలిపారు. దరఖాస్తు విధానం, అర్హతలు, అవసరమైన పత్రాలు, చెల్లింపులు, కేటాయింపు విధానం తదితర అంశాలపై ఈ హెల్ప్ లైన్ నెంబర్ 040-24603572ను సంప్రదించవచ్చునని మంత్రి తెలిపారు.
క్యూర్ పరిధిలో నిర్మాణం చేపట్టనున్న ఇందిరమ్మ టవర్స్ పై ఎలాంటి సందేహాలున్నా మధ్యవర్తులను నమ్మకుండా హెల్ప్ లైన్ నెంబర్ కు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఫోన్ చేసి అధికారిక సమాచారాన్ని తెలుసుకోవచ్చునని మంత్రి సూచించారు. అయితే, ఇందిరమ్మ టవర్స్ లో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు పదేళ్లు క్యూర్ పరిధిలో నివాసం ఉన్నవారే అర్హులు అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
పారదర్శకమైన విధానంలో లాటరీ పద్దతిలో ఇండ్లను కేటాయిస్తామన్న మంత్రి.. లబ్ధిదారుడు కేవలం రూ.6లక్షలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దరఖాస్తుదారు కచ్చితంగా క్యూర్ పరిధిలో పదేళ్లుగా నివాసం ఉంటున్నవారై ఉండాలని అన్నారు. దరఖాస్తుదారు లేదంటే కుటుంబానికి ఓఆర్ఆర్, క్యూర్ పరిధిలో సొంత ఇల్లు లేదా ప్లాట్ ఉండకూడదని, ఒక కుటుంబానికి ఒక దరఖాస్తు ఒక ప్లాట్ మాత్రమే కేటాయింపు ఉంటుందని తెలిపారు. దరఖాస్తు సమయంలో ఆధార్ నెంబర్ తెలియజేస్తే సరిపోతుందని, కుల, జీత భత్యాల ధృవీకరణ పత్రాలను అప్ లోడ్ చేయాల్సిన అవసరం లేదని, లాటరీ సమయంలో వీటిని సమర్పించవచ్చునని మంత్రి చెప్పారు.
