southwest monsoon
monsoon: నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. శనివారం కేరళ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన రుతుపవనాలు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రాబోయే మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని, అందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.
Also Read: దంచికొడుతున్న వర్షాలు.. తెలంగాణకు ఎల్లో.. కేరళకు రెడ్అలర్ట్ జారీ.. ముంబై, ఢిల్లీలోనూ కుండపోత వర్షం
సోమవారం ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మిగిలిన ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది.
2024లో నైరుతి రుతుపవనాలు జూన్ 2వ తేదీన ఏపీలోకి ప్రవేశించాయి. ఈ సంవత్సరం ముందుగానే ఏపీని రుతుపవనాలు పలుకరించాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం వారం రోజుల ముందుగానే ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశించాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రాబోయే వారం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ చేసింది.