తెలంగాణలో గొర్రెల పంపిణీ స్కాం కేసు అలజడి రేపుతోంది. గతంలో గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న ఏసీబీ.. ఇప్పటికే నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గొర్రెల స్కామ్ కేసులో మరో ఇద్దరిని నిందితులుగా చేర్చింది ఏసీబీ.
ఏ-1 నిందితుడిగా మొహియుద్దీన్, ఏ-2గా సయ్యద్ ఇక్రాముద్దీన్ హమ్మద్ను చేర్చింది. వారిద్దరు పరారీలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వారిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏసీబీ కేసు నమోదు చేయడానికే ముందే వారిద్దరు విదేశాలకు పారిపోయారు. అంతేగాక, సాక్షులను వారిద్దరు బెదిరింపులకు గురిచేస్తున్నారు.
గొర్రెల పంపిణీ స్కాంలో కేసులో భాగంగా అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆరోపణలు వస్తున్నాయి. గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయని కాగ్ రిపోర్టులోనూ పేర్కొంది.